భారత్ పైలట్ ను వదిలేస్తాం, అయితే….: పాకిస్తాన్ మెలిక

సైనిక నిర్బంధం నుంచి భారత్ పైలట్ సురక్షితంగా మాతృదేశానికి పంపాలన్న భారత్ అభ్యర్థను పరిశీలించేందుకు పాక్ సుముఖత చూపింది. అయితే, దానికి ఒక షరతు పెట్టింది. ఈ చర్య రెండు దేశాల మధ్య పెరిగిన టెన్షన్ ను తగ్గించే పక్షంలో తాను పైలట్ ను విడుదలచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి చెప్పారు.

పాక్ టివి చానెల్ జియో తో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ఉద్రికత్తను తగ్గించేందుకు దోహడపడేపక్షంలో భారత పైలట్ విడుదలచేసే విషయం పరిశీలించాలనుకుంటున్నామని ఖురేషి చెప్పారు.

ఈ విషయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ ప్రధాని నరేంద్రమోదీతో టెలిఫోన్ లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.

భారత్ పైలట్ ఒకరు సైనిక చర్యలో తప్పిపోయారని ప్రకటించిన తర్వాత నిర్భంధంలోకి తీసుకున్న పైలట్ అభినందన్ ను విడుదల చేయాలని భారతదేశం పాకిస్తాన్ ను కోరింది.
పాకిస్తాన్ యాక్టింగ్ హైకమిషనర్ ను రప్పించి, భారత విదేశాంగ కార్యాలయం ఈ సమాచారం అందించింది.

గాయపడిన అభినందన్ ని అలా వీడియోముందు పరేడ్ చేయించడానికి తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఇది జెనీవా వప్పందానికి, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు వ్యతిరేకమని కూడా స్పష్టం చేసింది. భారత పైలట్ కు ఎలాంటి హనీ చేయరాదని కూడా చెప్పింది.

అయితే, ఈ విషయంలో తాము ఎలాంటి డీల్ కుదుర్చుకునే ప్రసక్తి లేదని కూడాభారత్ ప్రకటించింది.