జర్నలిస్ట్ హత్య కేసులో డేరాబాబాను దోషిగా తేల్చిన కోర్టు

జర్నలిస్ట్ రామచంద్ర చత్రపతి హత్య కేసులో డేరాబాబాను పంచకుల కోర్టు దోషిగా తేల్చింది. డేరా బాబా అసలు పేరు గుర్మిత్ రామ్ రహీం. డేరా బాబాతో పాటు మరో  ముగ్గురిని కూడా సీబిఐ కోర్టు దోషిగా తేల్చింది. జనవరి 17న వీరికి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. దీంతో పంచకులలో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

డేరాబాబా మహిళల వేధింపుల గురించి జర్నలిస్ట్ రామచంద్ర 2002లో ప్యూర్ సచ్ఛ్ న్యూస్ పేపర్‌లో వార్తా కథనాలు రాశాడు. ఈ వార్తా ప్రచురణ అనంతరం అతడు హత్యకు గురయ్యాడు. దర్యాప్తులో డేరాబాబా ప్రధాన కారకుడిగా ఉన్నట్లు తేలింది. కేసు విచారణ చేపట్టిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు జర్నలిస్ట్ హత్య కేసులో  డేరా బాబాతో పాటు మరో ముగ్గురిని దోషులుగా తేల్చుతూ శుక్రవారం తీర్పును వెలువరించింది. కాగా తన ఇద్దరు మహిళా అనుచరులను అత్యాచారం చేసిన కేసులో డేరాబాబా ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్నాడు.