పెద్ద దిక్కు లేని తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు భారతీయ జనతా పార్టీ గోదావరి జలాలను ప్రయోగిస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో తమిళనాడులో ఆసక్తికరమయిన చర్చ సాగింది. ఇది చాలా వరకు తెలుగు పత్రికలకు అందలేదుగాని కొన్ని ఇంగ్లీష్ ప్రతికలు రాశాయి. ఆ చర్చ గోదావరి జలాలను తమిళనాడుకు తరలించాన్నది హామీ జరగింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడగానే తమిళనాడులో నీళ్ల కొరత తీర్చేందుకు చర్యలు చేపడుతుంది. గోదావరి-కావేరీ నదులను కలిపేస్తాం. దీనితో తమిళనాడుకు శాశ్వతంగా సాగునీరు తాగు నీరు కొరత తీరిపోతుంది. మోదీ తమిళనాడు భగీరథడయిపోతారు. ఈ ఎన్నికల్లో బిజెపి,ఎఐఎడిఎంకె, పిఎంకె పార్టీలు ఈ ప్రచారం మొదలుపెట్టాయి.
ఒక వారం కిందట ధర్మపురి జిల్లా వెల్లార్ పట్టణంలో పిఎంకె పార్టీ నేత డా అన్బుమణి రామదాస్ ఒక ఎన్నికల సభలో మాట్లాడారు. ఈ పట్టణం మెట్టూరు డ్యాంకు సమీపంలో ఉంటుంది. ఆయన మెట్టూరు డ్యాం తొందర్లో గోదావరి నీళ్లతో కలకలలాడుతుందని, నరేంద్ర మోదీ రెండో సారి ప్రధాని కాగానే గోదావరి నుంచి 200 టిఎంసిల నీళ్లు మెట్లూరు తరలించేందుకు చర్యలు తీసుకుంటారని ప్రకటించారు.ఇలా తమిళ నాడు లో నీళ్ల కరువున్న ప్రతిచోటా గోదావరి నీళ్లు చూపించి ఎఐడిఎంకె, పిఎంకె,బిజెపి కూటమి ఓట్లడిగింది.
దీని వెనక ఉన్న రాజకీయ అంచనా సింపుల్. ఏదో ఒక కారణంతో బిజెపి తమిళనాడులో ప్రవేశించాలనుకుంటున్నది. 2014 ఎన్నికల్లో కన్యాకుమారి నుంచి పొన్ రాధాకృష్ణన్ లోక్ సభ కు గెలిచారు. అయితే, తర్వాత వాతావరణం అనకూలించలే. ఈ మధ్యకాలంలో చాలా మార్పులొచ్చాయి. తమిళనాడులో పెద్దవాళ్లంతా పోయారు. జయలలిత పోయింది, కరుణానిధి పోయారు. అందువల్ల నేను మీదకు పెద్దదిక్కవుతానని మోదీ చెబుతున్నారు. ఇందులో భాగంగా తాను గోదావరి జలాలను తీసుకొస్తానంటున్నారు.
బిజెపి వ్యూహం
తెలంగాణలో టిఆర్ ఎస్ ప్రభుత్వం ఉంది. అది మోదీకి మిత్రపక్షమే. ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి అధికారంలోకి వస్తుంది. అదీ మోదీ అనుకూల పార్టీయే. తమిళనాడు లో ఎఐఎడిఎంకె ఉంది. కేంద్రంలో మోదీ. ప్రాజక్టుకు నేషనల్ ప్రాజక్టు హోదా. ఒప్పందం చేసుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి?
గోదావరి జలాలు రావాలంటే ఆంధ్ర, తెలంగాణ ఒప్పుకుంటేచాలు. మహారాష్ట్రంలో కూడా బిజెపి ప్రభుత్వమే ఉంది. దక్షిణ భారత రాజకీయాలలో ఒక కొత్త దశ ప్రారంభం కానుంది. బిజెపిని ద్వేషించిన దక్షిణ భారదేశంలో బిజెపి నేరుగా కాకపోయినా ఎన్డీయే రూపంలో పట్టు సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనిని బిజెపి, దాని తమిళ మిత్ర పక్షాలు తమిళనాడులో ప్రయోగిస్తున్నాయి. తమిళనాడులో నీటిహామీలు బాగా పనిచేస్తాయి. నీరు అక్కడ చాలా సెన్సిటివ్ సమస్య. గతంలో ఎన్టీరామారావు మదరాసుకు తెలుగు గంగ ద్వారా 15 టిఎంసిల నీళ్లందించారు. ఇలాగే ఇపుడు గోదవారి మిగులు జలాలను సముద్రంలో పడేసే బదులు తమిళనాడుకు అందిస్తారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల నడుస్తున్న తీరు చూస్తే బిజెపివ్యూహం ఫలించేలా కనిపిస్తుంది. ఆంధ్రలో జగన్ ముఖ్యమంత్రి అవుతున్నారని, ఆయన, కెసిఆర్ తో కలసి ఈ ప్రాజక్టుకు సహకరిస్తారని బిజెపి ఆశ. ఈ రెండు ప్రభుత్వాలు భారీ డిమాండ్లు సాధించుకుని తమిళనాడుకు గోదావరి నీళ్లను తీసుకెళ్లేందుకు అనుమతించవచ్చు.
దీర్ఘకాలిక వ్యూహం
తమిళనాడు ప్రజలకు గోదావరి నీళ్ళ ఆశచూపి, ఒక్క బిజెపియే ఈ కల నెరవేర్చగలదని చెప్పడం జయలలిత చనిపోయాక మొదలయింది. చాలా జాగ్రత్త ఎన్డీయే ప్రభుత్వం గోదావరి జలాల అస్త్రాన్ని వాడుతూ వస్తున్నది. కరుణానిధి పోయాక ఇది తీవ్రమయింది. పెద్ద వాళ్లిద్దరు లేరు కాబట్టి మీకు మేము పెద్ద దిక్కుగా ఉండాలనుకుంటున్నామన్న సందేశం బిజెపి పంపుతూ ఉంది. దీనికి గోదావరి జలాలు సరైనవని బిజెపి విశ్వాసం. ఈ ప్రాజ్టకు పూర్తయితే, మోదీ తమిళనాడు భగీరథుడవుతారు, దీనికి ఎఐఎడిఎంకె వత్తాసు పలుకుతూ వస్తున్నది.
పెద్ద దిక్కులేని తమిళనాడులో పట్టు సంపాదించేందుకు చేసిన మోదీ నాయకత్వంలో బిజెపి చేసిన రాజకీయ ప్రయత్నాలు హుందాగా లేక, చాలా వ్యతిరేకత కూడగట్టుకుంది. తమిళల ఆగ్రహానికి బిజెపి గురైంది. చెన్నైలోని ఆర్ కెపురం ఉప ఎన్నికలో బిజెపి దారుణ ఓటమికి ఇదేకారణం. #GoBackModi నినాదం దుమ్ముురేగిపోయేందుకు కూడా ఇదే కారణం. ఈ ఆగ్రహజ్వాలలను గోదావరి నీళ్లతో బిజెపి చల్లార్చానుకుంటున్నది.
గోదావరి జలాల చరిత్ర
గోదావరి -కావేరీ నదులను అనుసంధానం చేయాలన్నది ఎపుడో కెఎల్ రావు రోజుల్లో వచ్చిన ప్రతిపాదన. ఈ మధ్య కాలంలో దీనిని మర్చిపోయారు. ఈ మధ్య నదుల అనుసంధానం మళ్లీ చర్చకు వచ్చింది.
దీనిని బిజెపి తమిళనాడు ప్రజలకు ముందుకు తెచ్చి ఎన్నికల్లో లబ్ది పొందాలనుకుంటున్నది. జయలలిత 2016 డిసెంబర్ లో చనిపోయారు. 2017 నుంచి బిజెపి నేతలు ఈ ప్రతిపాదను తెస్తున్నారు. 2017 నవంబర్ లో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ చెన్నైలో గోదావరి- కావేరీ నదుల అనుసంధానం ప్రతిపాదన చేశారు.
గోదావరిలో నదిలో 3000 టిఎంసిల మిగులు జలాలున్నాయని , కొంతభాగాన్ని తమిళనాడుకు తరలిస్తామని ఆయన అన్నారు. దీని మీద తన శాఖ కృషి మొదలుపెట్టిందని కూడా చెప్పారు.
‘ గోదావరి మిగులు జలలాను మొదలు కృష్ణానదిలోకి తరలించి, తర్వాత పెన్నానదిలో కలపి, అక్కడి నుంచి కావేరికి తీసుకుపోతాం,’ అని గడ్కరీ ప్లాన్ కూడా చెప్పారు. ప్రస్తుతం రుతుపవనాల మీద ఆదార పడ్డ తమిళనాడుకు ఇది వరప్రసాదం అవుతుందని కూడా ఆయన చెప్పారు. దీని మీద తొందరలో కర్నాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులతో కూడా మాట్లాతానని కూడా చెప్పారు. దీని కయ్యే ఖర్చులో 90 శాతమే కర్నాటకయే భరిస్తుందని కూడా చెప్పారు.
ఈ ప్రతిపదనను అవకాశం ఉన్నపుడల్లా తమిళనాడు ప్రభుత్వం కూడా జనంలోకి తీసుకువెళుతూ ఉంది.2018 మే 14 న సేలం లో నేషనల్ హైవే ప్రాజక్టు కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళని స్వామి నమక్కల్, సేలం, తిరుచ్చి జిల్లాలకు గోదావరి జలాలు అందుతాయని చెప్పారు. గోదావరి నుంచి 125 టిఎంసిల నీటిని కావేరికి తరలించేందుకు కృషి జరుగుతూ ఉందని చెప్పారు. తాను ఈ ప్రాజక్టు గురించి కేంద్రం మీద వత్తిడి తీసుకువస్తున్నాని కూడా చెప్పారు.
తర్వాత 2018 జూలైలో ఆయనే మెట్టూరు రైతులకు ఇదే హామీ ఇచ్చారు. గోదావరి నుంచి 3000 టిఎంసిల నీరు బంగాళాఖాతంలోకి వెళుతూ ఉంది. ఇందులో నుంచి 125 టిఎంసిల నీరు తమిళనాడుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదావరి నదిని కరూర్ జిల్లాలో కావేరీతో అనుసంధానం చేస్తాం. అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా ఎగువ ప్రాంతాలకు పంప్ చేస్తాం. మెట్టూరుకు ఇలాగే గోదావరినీళ్లొస్తాయి,’అని ఆయన చెప్పారు. ఈ నీళ్ల స్వప్నం ఇపుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా అందరికి కనిపించేలా చేశారు.
ఆంధ్రకు అభ్యంతరం ఉండదు
గోదావరి జలాలను కావేరికి తీసుకువెళ్లే ప్రతిపాదనకు ఆంధ్ర నుంచి అభ్యంతరం ఉండాల్సిన పనిలేదని రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి అన్నారు. అయితే, ఈప్రాజక్టు ను అమలుచేసేటపుడు రాష్ట్ర ప్రయోజనాలకు భంగం లేకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. ’కావేరికి నీటిని ఎక్కడి నుంచి తరలిస్తారనేది ముఖ్యం. పూర్వం కెఎల్ రావు సూచించిన మార్గం పెన్నా మార్గంలో తీసుకెళతారా లేక తెలంగాణ నుంచి కొత్త ప్రాజక్టు కట్టి తీసుకెళతారా అనేది తేలాది. తెలంగాణ నుంచి ఆల్మట్టి అక్కడి నుంచి కావేరికి తీసుకెళ్లే ప్రతిపాదనచాలా ఖర్చుతో కూడుకున్నది, ఒక వేళ ఈ మార్గమే ఖరారయితే, ఆంధ్రకు గోదావరి జలాలు తగ్గి పోయే ప్రమాదం ఉంది. అలాకుండా సోమశిల ద్వారా తెలుగుగంగ మార్గంలో తీసుకెళితే, రాష్ట్రానికి అదనంగా ప్రయోజనం సాధించవచ్చా అలోచించాలి,’అని మాకిరెడ్డి అన్నారు.
అయితే, ఈ పథకం చూపినంత మాత్రాన తమిళకు మోదీ మీద ఉన్న ఆగ్రహం చల్లారుతుందా అనేది అనుమానమే నని అయన వ్యాఖ్యానించారు.
(ఫోటో Hindustan Times సౌజన్యం)
