మాజీ గవర్నర్, మాజీ సీఎం ఎన్డీ తివారీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తివారీ ఢిల్లీలోని సాకేత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జ్వరం, న్యూమోనియా వ్యాధితో బాధ పడుతున్న తివారీ గురువారం సాయంత్రం కన్నుమూశారు.
ఉత్తరప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్ గా తివారీ పనిచేశారు. 1925 అక్టోబర్ 18 న ఉత్తరఖాండ్ లోని నైనిటీల్ జిల్లా బాలూటి గరామంలో జన్మించిన తివారీ పూర్తి పేరు నారాయణ దత్ తివారీ. ప్రస్తుతం ఆయన వయస్సు 92 ఏళ్లు. గురువారమే ఆయన 93 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఇదే రోజు ఆయన చనిపోవడం గమనార్హం.
సీనియర్ యనాయకుడైన తివారి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ కు మూడు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. 1976-77, 1984-85, 1988-89 , 2002 నుంచి 2007 వరకు ఆయన ఉత్తరాఖాండ్ సీఎంగా సేవలందించారు. 1986 నుంచి 87 వరకు విదేశీ2 వ్యవహారాల శాఖ మంత్రిగా, పెట్రోలియం శాఖ మంత్రిగా చేశారు.
అలహాబాద్ యూనివర్సిటిలో ఎంఏ, ఎల్ ఎల్ బీ పూర్తి చేసిన తివారీ స్వాతంత్రోద్యమ కాలంలో పోరాటంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.తివారి 2007 ఆగస్ట్ 19న ఉమ్మడి ఏపీ గవర్నర్గా నియమితులయ్యారు. ఆగస్టు 22న గవర్నర్గా ప్రమాణస్వీకారం చేశారు. డిసెంబర్ 26, 2009న గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న సమయంలో ఆయనపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజభవన్లో ఆయన రాసలీలల వీడియోలు బయటకు రావడంతో అప్పట్లో తీవ్ర సంచలనమైంది. దీంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే.. తాను ఎన్డీ తివారీ కన్నబిడ్డనంటూ రోహిత్ శేఖర్ అనే యువకుడు కోర్టు మెట్లు ఎక్కాడు. డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని ఆదేశించగా.. తివారీ కొడుకునేనని పరీక్షల్లో తేలింది. కోర్టు తీర్పు నేపథ్యంలో 2014 మార్చి 3న రోహిత్ శేఖర్ను తన కుమారుడిగా తివారీ అంగీకరించారు. 2014 మే 14న శేఖర్ తల్లి ఉజ్వలా తివారీని వివాహం చేసుకున్నారు. కాంగ్రెస్ వాదియైన ఎన్డీ తివారీ…. రోహిత్ను బీజేపీలో చేర్చడం చర్చనీయాంశమైంది.
పుట్టినరోజు నాడే ఎన్డీ తివారీ మరణించడంతో విషాదం నెలకొంది. 1925 అక్టరోర్ 18న ఆయన జన్మించారు. 93 ఏళ్ల వయస్సులో 2018 అక్టోబర్ 18న ఆయన మరణించారు.
