స్పై కోసం నిఖిల్ చేసిన మ్యాజిక్ వర్క్ అవుతుందా?

కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన నిఖిల్ సిద్ధార్ద్ తరువాత 18 పేజెస్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. కెరియర్ ఆరంభంలో రెగ్యులర్ కమర్షియల్ జోనర్ లో సినిమాలు చేసి ఫ్లాప్ లు సొంతం చేసుకున్న నిఖిల్ స్వామీ రారా మూవీతో కంప్లీట్ గా స్టైల్ మార్చేశాడు. డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన రూట్ ఏర్పాటు చేసుకున్నాడు.

అదే రూట్ లో వెళ్తూ కార్తికేయ 2తో ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు స్పై సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కె రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ రెడీ అయిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.

నేడు ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. మూవీ కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ అందుకుంటుందనే గట్టి నమ్మకంతో నిఖిల్ ఉన్నారు. కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మైలేజ్ తో స్పై సినిమాకి దేశ వ్యాప్తంగా ఆదరణ వస్తుందని అనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాని సుభాష్ చంద్రభోస్ మిస్సింగ్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కించినట్లు కొంత ప్రచారం జరిగింది.

టీజర్ కూడా అదే విధంగా కట్ చేసి మూవీపై అంచనాలు పెంచేశారు. ఇక తాజా ట్రైలర్ తో సుభాష్ చంద్రభోస్ అనే పేరున్న హీరో జై అన్నయ్య మిస్ అవుతాడు. అతను మిస్ అవ్వడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అతనికి టెర్రరిస్ట్ కి ఉన్న సంబంధాలు ఏంటి. వాటిని హీరో జై ఎలా చేధించాడు అనే అంశాలతో మూవీ ఉండబోతోందని రివీల్ చేసేశారు.

అయితే ఈ స్టొరీతో పాటు అంతర్లీనంగా ఏమైనా సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ గురించి చెప్పే ప్రయత్నం స్పై సినిమాతో చేస్తున్నారా లేదంటే ట్రైలర్ లో చూపించిన కథనే ఉంటుందా అనేది తేలిపోనుంది. ఏది ఏమైనా స్పై జోనర్ లో వచ్చే కథలతో దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో నిఖిల్ యాక్షన్ మూవీ ఏ మేరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.