RRR Movie: తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, యావత్ దేశం సైతం ఎప్పటి నుంచో ఎంతో ఎదురు చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం ఒక ఎత్తు అయితే, అందులో ఇద్దరు స్టార్ హీరోస్ నటించడం ఇంకో చెప్పుకోదగిన విషయం. దీంతో ప్రారంభం నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి.
కాగా ఈ మూవీ రిలీజ్ కాబోతోందన్న నేపథ్యంలో చిత్ర బృందం వినూత్నంగా ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఎందులోనూ విజయేంద్ర ప్రసాద్ కనిపించక పోవడంతో అందరిలోనూ కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా ఆయన కొన్ని సీక్రెట్స్ ను షేర్ చేసుకున్నారు. రాజమౌళి మొదట మల్టీ స్టారర్ తీయాలని అనుకున్నారని, కానీ సెలక్షన్ కు ముందే స్క్రిప్ట్ ను డెవలప్ చేశారని ఆయన చెప్పారు. ముందుగా రజనీ కాంత్ – అర్జున్, సూర్య – కార్తి లాంటి వారిని ఈ సినిమాకు అనుకున్నా, ఆ తర్వాత మాత్రం రియల్ లైఫ్ లో అన్యోన్యంగా ఉండే వాళ్ళను తీసుకోవాలని రాజమౌళి భావించారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. అలా వివిధ పరిశీలనల తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఎంపిక చేశారని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే ఈ సినిమాలో వీరిద్దరి క్యారెక్టర్స్ లో చాలా షేడ్స్ ఉంటాయన్న ఆయన, పాత్రల పరంగా చూస్తే రామ్ చరణ్ కే రెండు మార్కులు ఎక్కువ వేస్తానని ఆయన చెప్పారు. మూవీ ప్రారంభంలోనే హీరోస్ భిన్న ధృవాలు అని తెలుస్తుందని, కానీ సినిమా సాగుతున్నా కొద్దీ వీరి మధ్య విభేదాలు రాకుండా ఉంటే బాగుండు అని మనం ఫీల్ అయ్యేలా స్టోరీ ముందు సాగుతుందని ఆయన అన్నారు. చివరగా ఆ ఇద్దరి హీరోస్ మధ్య జరిగే పోరాటం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది అని విజయేంద్ర ప్రసాద్ వివరించారు.
