‘టిల్లు స్క్వేర్‌’ విడుదల అందుకేనా?

సిద్ధు జొన్నలగెడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న ‘టిల్లు స్క్వేర్‌’ సినిమా విడుదల ఎప్పుడో ప్రకటించారు కానీ ఆ తరువాత ఆ సినిమా గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఈ సినిమా నుంచి ఒక పాటను కూడా విడుదల చేశారు, అది కూడా వైరల్‌ అయింది, ఆ తరువాత ఈ సినిమా కొత్త విడుదల తేదీ కానీ, సినిమా షూటింగ్‌ ఎంతవరకు వచ్చింది అని కానీ, ఎటువంటి సమాచారం లేదు.

చాలా సినిమాలు తమ విడుదల తేదీలను ప్రకటించాయి కానీ, ‘టిల్లు స్క్వేర్‌’ మాత్రం ఇంకా సందిగ్ధంలోనే వుంది. కొన్ని వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయిందని, ఎందుకంటే కథలో మళ్ళీ మార్పులు అవసరమని ఆపేసారు అని వైరల్‌ అవుతోంది. దర్శకుడు మల్లిక్‌ రామ్‌కి, కథానాయకుడి సిద్ధు జొన్నలగెడ్డకి మధ్య కొన్ని కధాపరమైన భేదాలు ఉన్నాయని, అందుకనే షూటింగ్‌ ఆగిపోయిందని కూడా అంటున్నారు.

ఈ సినిమాని సితార ఎంటర్‌ టైనమెంట్‌వాళ్ళు నిర్మిస్తున్నారు. ’టిల్లు స్క్వేర్‌’ సినిమా ‘డీజే టిల్లు’ కి సీక్వెల్‌ గా వస్తోంది. అంటే ప్రేక్షకులు ఈ సినిమా విూద చాలా అంచనాలు పెంచుకున్నారని, అందువలన టిల్లు పాత్ర కొంచెం వైవిధ్యంగా ఉండేట్టు ఇంకా బాగా తీర్చిదిద్దడానికి టైము కావాల్సి వచ్చిందని, అందుకే విడుదలలో జాప్యం జరుగుతోందని కూడా అంటున్నారు. అందుకని షూటింగ్‌ ఆపేసి, కథలో మార్పులు చేస్తున్నారని కూడా ఒక వార్త వచ్చింది.

ఈ సినిమా మొదటి నుండీ కొంచెం వివాదాల్లోనే వుంది. మొదట్లో ఈ సినిమాకి కథానాయికలు కుదరలేదు, మార్చారు, చివరికి అనుపమ పరమేశ్వరన్‌ ఫిక్స్‌ అయింది. ఆ తరువాత ఈ సినిమా ఆగస్టు లో విడుదల అన్నారు, అయిపొయింది, సెప్టెంబర్‌ అన్నారు, అది కూడా లేదు, అక్టోబర్‌ 6 అన్నారు, అది కూడా అయిపొయింది. ఇప్పుడు కొత్త విడుదల తేదీ కూడా ప్రకటించలేదు.

అసలు షూటింగ్‌ కూడా అయిందో లేదో కూడా తెలియదు. సిద్ధూ ఇందులో కధానాయకుడే కాదు, అతనే సినిమాకి కథ, కథనం సమకూరుస్తున్నాడు. సెట్స్‌ లో కానీ, షూటింగ్‌ లో కానీ, సిద్ధు మాటే ఫైనల్‌ అని కూడా అంటున్నారు.

అతను షూటింగ్‌ చేసిన సన్నివేశాలను ఒకసారి చూసి అవి సరిగ్గా లేకపోతే మళ్ళీ రీషూట్‌ చెయ్యాలా వద్దా అనే విషయం డిసైడ్‌ చేసేది కూడా అతనే అని అంటున్నారు. మామూలుగా సిద్ధు సినిమాలలో కొంచెం అడల్ట్‌ జోక్స్‌ ఎక్కువగానే ఉంటాయి, మరి ఇందులో అవేమైనా ఎక్కువయ్యాయా అనే సందేహం కూడా వెలిబుచ్చారు కొందరు. ఏమైనా ఈ సినిమా అయితే ఇప్పట్లో విడుదలయ్యేట్టు మాత్రం కనపడటం లేదు.