టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తమ నివాసాన్ని లండన్కు మార్చాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరేలా కొన్ని కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ నెనే తాజాగా ఈ విషయం మీద తన అభిప్రాయం తెలిపారు.
ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డాక్టర్ నెనే, విరాట్ మరియు అనుష్క లండన్కు వెళ్లాలనుకుంటున్నారని అన్నారు. “వీరిని చాలా సార్లు కలిశాను. విరాట్ గొప్ప వ్యక్తి. అనుష్కతో మాట్లాడినప్పుడు, వారు తమ పిల్లలకు సాధారణ జీవితం ఇవ్వాలనుకుంటున్నారని తెలిసింది” అని వెల్లడించారు. భారతదేశంలో భారీ క్రేజ్ కారణంగా వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోయే పరిస్థితి ఉందని అన్నారు.
డాక్టర్ నెనే ప్రస్తావించినట్లు, సెలబ్రిటీల జీవితంలో వ్యక్తిగత సమయం చాలా తక్కువగా మిగులుతుంది. ప్రతి చిన్న విషయంలోనూ పెద్ద హంగామా జరుగుతుంది. అందుకే తమ పిల్లలకు సాధారణ వాతావరణం అందించాలనే ఉద్దేశంతో విరాట్, అనుష్క లండన్లో స్థిరపడాలని భావిస్తున్నారని చెప్పారు. చిన్న చిన్న విషయానికే సెల్ఫీలు, మీడియా శబ్దం ఉండటంతో, వారి వ్యక్తిగత జీవితం చాలా పరిమితమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో, విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. విరాట్ కుటుంబంతో కలిసి లండన్కు వెళ్లే అవకాశముందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఫిబ్రవరి 2024లో విరాట్-అనుష్క దంపతులు తమ రెండో బిడ్డ అకాయ్ను స్వాగతించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఎక్కువగా లండన్లో గడుపుతున్న విషయం తెలిసిందే. మొత్తానికి, విరాట్-అనుష్క లండన్ ప్లాన్ పై ప్రస్తుతం టాక్ జోరుగా సాగుతోంది. అయితే, అధికారికంగా వీరిద్దరూ ఈ విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. మరి క్లారిటీ వచ్చేదెప్పుడో చూడాలి.