విజయ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ తృప్తి దిమ్రి?

‘లైగర్‌’ సినిమా డిజాస్టర్‌ తర్వాత రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఓ సాలిడ్‌ సక్సెస్‌ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. గత ఏడాది వచ్చిన ‘ఖుషి’ ఆ రేంజ్‌ సక్సెస్‌ ని అందించలేకపోయింది. ఫ్యామిలీ లవ్‌ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్స్‌ ఆఫీస్‌ వద్ద ఫరవాలేదనిపించింది.

కానీ రౌడీ హీరో నుండి ఫ్యాన్స్‌ మాత్రం బ్లాక్‌ బస్టర్‌ ఆశిస్తున్నారు. అందుకే ఈసారి పవర్ఫుల్‌ పోలీస్‌ పాత్రతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో ‘జెర్సీ’ మూవీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్ట్‌ ఒకటి.

ఇందులో విజయ్‌ దేవరకొండ కానిస్టేబుల్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ మూవీ షూటింగ్‌ శ్రీలీల వల్లే ఆలస్యం అయ్యింది. శ్రీలీల వరుస సినిమా షూటింగ్స్‌ తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు కోసం డేట్స్‌ కేటాయించలేకపోయింది.

దాంతో ఈ ప్రాజెక్టు సెట్స్‌ పైకి వెళ్లకుండా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్‌ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని, తన ప్లేస్‌లో రష్మిక మందన్నాని తీసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి నిజంగానే శ్రీలీల తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె స్థానంలో యానిమల్‌ మూవీలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటించిన బాలీవుడ్‌ బ్యూటీ తృప్తి దిమ్రి తో పాటూ ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ లను మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యానిమల్‌ మూవీలో కనిపించింది కాసేపే ఆయన తన గ్లామర్‌ ట్రీట్‌ తో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది తృప్తి దిమ్రి. ఈ సినిమా తర్వాత సోషల్‌ విూడియాలో నేషనల్‌ క్రష్‌ గా మారిన ఈ ముద్దుగుమ్మని ఇప్పుడు హీరోయిన్‌ గా తీసుకునే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈమెతో పాటు ’సప్త సాగరాలు దాటి’ సినిమాలో తన న్యాచురల్‌ యాక్టింగ్‌ తో ఆకట్టుకున్న రుక్మిణి వసంత్‌ ను కూడా మరో ఆప్షన్‌ గా పెట్టుకున్నారట. మరి ఈ ఇద్దరిలో విజయ్‌ దేవరకొండ సరసన ఎవరు నటిస్తారనేది త్వరలోనే తెలియనుంది. కాగా మార్చిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానున్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ పరశురామ్‌ దర్శకత్వంలో నటిస్తున్న’ఫ్యామిలీ స్టార్‌’ షూటింగ్‌ చివరి దశలో ఉంది. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనా నెలకొన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.