యూవీ క్రియేషన్స్.. శెట్టి జోడి కోసం మరో డేట్!

నవీన్ పోలిశెట్టి అనుష్క శెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను ఎప్పుడో రెండు మూడు నెలల క్రితం విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా ఊహించిన విధంగా వాయిదాలు పడుతూ వస్తూనే ఉంది. ఎప్పటిలానే యు వి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమా విషయంలో కూడా అదే తరహాలో ఆలస్యాన్ని కొనసాగిస్తుంది.

గతంలో రెండుసార్లు సినిమా విడుదల డేట్ లను ఫిక్స్ చేసుకున్న నిర్మాతలు మళ్లీ వాయిదాలు వేశారు. అసలు ప్లాన్ ప్రకారం ఏది జరగడం లేదు అనే కామెంట్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆమధ్య సినిమా విడుదల డేట్ పై క్లారిటీ రావడంతో హీరో నవీన్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. కానీ మళ్ళీ UV క్రియేషన్స్ సినిమా డేట్ ను మార్చేసింది.

దీంతో నవీన్ పోలిశెట్టి కూడా ప్రమోషన్స్ కు మళ్ళీ బ్రేక్ ఇచ్చేసి సైలెంట్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం ప్లాన్ ప్రకారం అయితే సెప్టెంబర్ 7వ తేదీన సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. దర్శకుడు పి మహేష్ బాబు దాదాపు అన్నీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేశాడని సమాచారం.

అయితే పర్ఫెక్ట్ డేట్ కోసం ఆలోచించి మొదట ఈనెల చివరలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అది పర్ఫెక్ట్ కాదు అని సెప్టెంబర్ కు సినిమాను షిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అనుష్క శెట్టిని వెండి తెరపై చూసి చాలా కాలమే అయింది. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక జాతి రత్నాలు సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న నవీన్ పోలిశెట్టి కూడా ఈ సినిమాతో సక్సెస్ అందుకుని మళ్ళీ ట్రాక్లోకి రావాలని అనుకుంటున్నాడు.