‘గుంటూరు కారం’లో వేగం పెంచి దర్శకుడు!

మహేష్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ‘గుంటూరు కారం’ తాజా షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. తాజా సమాచారం ప్రకారం ఇందులో మహేష్‌ బాబుకి తాతగా నటిస్తోన్న ప్రకాష్‌ రాజ్‌ ఇల్లు, ఆఫీస్‌ సెట్‌ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. చాలామంది క్యారెక్టర్‌ నటులు ఇందులో పాల్గొంటున్నట్టు తెలిసింది. ఈ ఇల్లు సెట్‌ వేయడానికి భారీగా ఖర్చు చేశారంటున్నారు.

ఈ సన్నివేశాల్లో ప్రకాష్‌ రాజ్‌, మురళి శర్మ, వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌, జయరాం, రమ్య కృష్ణ ఇలా చాలామంది ఉన్నారని తెలిసింది. అభిమానులు ఆనందించే విషయం ఏమిటంటే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. ఈరోజు చాలా కాంబినేషన్‌ సన్నివేశాలు వుంటాయని, ఈ షూటింగ్‌ ఈ నెలాఖరు వరకు ఉంటుందని తెలిసింది. మహేష్‌ బాబు కూడా ఈ షూటింగ్‌ లో పాల్గొంటాడు అని కూడా యూనిట్‌ సభ్యుడు ఒకరు తెలిపారు.

ఈ సినిమా రానున్న సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరి ఇప్పుడు మొదలు పెట్టి షూటింగ్‌ నవంబర్‌ కి పూర్తి చేయగలరా? లేదా అనే విషయం మీదే ఈ విడుదల తేదీ ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.