17 ఏళ్ల తర్వాత మెగాస్టార్ తో జతకడుతున్న త్రిష

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. ఆగస్టు 11 రిలీజ్ చేయడానికి సలహాలు చేస్తున్నారు. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూవీలో తమన్నా మెగాస్టార్ కి జోడిగా నటిస్తోంది.

దీని తర్వాత చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. ఈ చిత్రాన్ని మెగాస్టార్ కూతురు సుస్మిత నిర్మించబోతుంది. మలయాళీ హిట్ మూవీ బ్రోడాడీ రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం ప్రసన్న కుమార్ బెజవాడ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ మెగాస్టార్ కి కొడుకుగా నటించనున్నాడు.

సిద్దు జోడిగా శ్రీలీల హీరోయిన్ గా చేయనుంది. మెగాస్టార్ చిరంజీవికి జోడిగా సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిషను తీసుకుంటున్నారంట. ఇప్పటికే త్రిషతో సంప్రదింపులు కూడా జరపడం, ఆమె ఒప్పుకోవడం జరిగిపోయాయని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది. త్రిష 17 ఏళ్ల క్రితం స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా నటించారు.

హీరోయిన్ గా అప్పుడప్పుడే త్రిష తన ఇమేజ్ పెంచుకుంటూ వచ్చే క్రమంలో స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ తో ఆడి పాడింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మరల ఇన్నేళ్ల తర్వాత బ్రో డాడీ రీమేక్ లో మెగాస్టార్ తో జతకట్టబోతోంది. పొన్నియన్ సెల్వన్ మూవీతో త్రిష మరల బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇప్పుడు లియో చిత్రంలో నటిస్తోంది.

దీని తర్వాత వెంటనే మెగాస్టార్ తో నటించే ఛాన్స్ సొంతం చేసుకోవడం విశేషం. భోళా శంకర్ రిలీజ్ తర్వాత బ్రో డాడీ రీమేక్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి భార్యగా, సిద్దుకి తల్లిగా ఈ చిత్రంలో త్రిష పాత్ర ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. మరి అది ఎంత వరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.