టాలీవుడ్లో ఇటీవల సినిమా మేకింగ్ మాత్రమే కాదు, స్టార్ హీరోల మద్య సంబంధాలు కూడా కొత్త దిశగా మారిపోతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోల కలిసి నటించడం అరుదుగా కనిపించేది. కానీ ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు సాధారణమైన విషయమైపోయాయి. టాప్ హీరోల మద్య సహకారం పెరగడం సినీ ప్రపంచానికి మంచి సంకేతంగా మారింది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇదే సమయంలో రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇది స్టార్ వాల్యూ పెంచడమే కాక, ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.
ఇక రజనీ మరో ప్రాజెక్ట్ ‘జైలర్ 2’లోనూ భారీ స్టార్ కాస్టింగ్ ప్లాన్ చేశారు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, బాలకృష్ణ, ఫహద్ ఫాజిల్ వంటి స్టార్లు ఇందులో స్పెషల్ రోల్స్ పోషించనున్నారు. మరోవైపు ‘సలార్ 2’లో మలయాళ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ పాత్ర మళ్లీ కీలకమవుతుంది. ఇలా మల్టీస్టారర్ ట్రెండ్ అన్ని ఇండస్ట్రీల్లో బలపడుతోంది.
‘కల్కి 2898 AD’లో ప్రబాస్తో అమితాబ్ బచ్చన్ కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘కల్కి 2’లో కూడా ఆ కలయిక కొనసాగనుంది. బాలీవుడ్లో ఎన్టీఆర్ ‘వార్ 2’లో హృతిక్ రోషన్తో కలిసి పనిచేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. స్టార్ హీరోలు కథ అవసరాలకు తగ్గట్లు ముఖ్యమైన పాత్రలు తీసుకోవడం అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేస్తోంది. మొత్తానికి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా స్టార్ హీరోలు కలిసి పనిచేయడమే ఇప్పుడు కొత్త ట్రెండ్. ఈ మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులకు భారీ స్థాయి వినోదాన్ని అందించడమే కాకుండా, ఇండస్ట్రీ స్థాయిని కూడా పెంచుతున్నాయి.