అఖిల్ వెంట ముగ్గురట!

సినీ రంగంలో స్టార్ల వారసులు హీరోలుగా పరిచయం అవడం సర్వసాధారణమైన విషయమే. కానీ, అందులో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్లే వాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. మరికొందరు అయితే ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందులో అక్కినేని అఖిల్ ఒకడు. చాలా కాలం క్రితమే వచ్చిన అతడు.. ఇప్పటికీ సరైన హిట్ కొట్టలేదు.

ఈ అక్కినేని హీరో ‘అఖిల్’ అనే చిత్రంతో హీరోగా సినీ రంగంలోకి వచ్చాడు. తర్వాత ‘హలో’, ‘మిస్టర్ మజ్నూ’ చిత్రాలతో రీలాంచ్ అవుతూ వచ్చాడు. కానీ, ఇవేమీ అతడికి హిట్ ఇవ్వలేదు. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ మాత్రం అతడిని నిలబెట్టింది. అలా సంతోషించే లోపే ‘ఏజెంట్’ రూపంలో అఖిల్‌కు బిగ్ షాక్ తగిలింది.

ఇటీవలే అఖిల్ ‘ఏజెంట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా దాదాపు రూ. 30 కోట్ల నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అతడు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేయడానికి అఖిల్ రెడీ అయినట్లు తెలిసింది.

ఇక, అఖిల్ ఇప్పుడు ఏకంగా ముగ్గురు డైరెక్టర్లతో కథా పరమైన చర్చలు జరుపుతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అందులో ఒకరు వంశీ పైడిపల్లి కాగా.. మరికొరు.. శివ నిర్వాణ అని తెలిసింది. ఇక, మూడో డైరెక్టర్ ఇటీవలే ‘దసరా’తో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్ ఓదెల అని తెలిసింది. ఈ ముగ్గురూ మూడు రకాల జోనర్లలో కథలను చెప్పినట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అక్కినేని అఖిల్‌కు శివ నిర్వాణ ఓ లవ్ స్టోరీని చెప్పాడట. అలాగే, వంశీ పైడిపల్లి ఓ సందేశాత్మక కథను వినిపించినట్లు తెలిసింది. ఇక, శ్రీకాంత్ ఓదెల అయితే ఓ మాస్ స్టోరీ లైన్‌ను చర్చించాడని అంటున్నారు. ఈ ముగ్గురితోనూ అతడు సినిమాలు చేస్తాడని అంటున్నారు. అయితే, ఏది ముందు మొదలవుతుంది అనేది సస్పెన్స్‌గా మారింది.