‘లియో’ విడుదలకు రంగం సిద్దం!

’ఇళయదళపతి’ విజయ్‌ నటించిన తాజా చిత్రం ’లియో’ ఈనెల 19న విడుదలకానున్న నేపథ్యంలో రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు ఐదు ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటును కల్పించింది.

సినిమా విడుదల రోజైన 19వ తేదీ గురువారం మాత్రం తొలి ఆటను ఉదయం 5 గంటలకు ప్రారంభించవచ్చు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజుకు నాలుగు ఆటలతో పాటు ప్రత్యేక షో ఉదయం 9గంటలకు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పి. అముద పేర్కొన్నారు.

సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మాత లలిత్‌కుమార్‌ నిర్మించగా యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్‌. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా నటించారు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మరో ముఖ్యపాత్రను పోషించారు.

ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ కాగా, అందులోని అసభ్య డైలాగ్‌ను సెన్సార్‌ బోర్డు తొలగించింది. ఈ సినిమా రన్‌ టైం 164 నిమిషాల 52 సెకన్లు.