అందుకే సినిమాలకు బ్రేక్‌ చెబుతున్నా : రణబీర్‌కపూర్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు. ఇటీవలే సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ నిర్వహించిన రణ్‌బీర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ఆరు నెలల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్నట్లు తెలిపారు.

‘యానిమల్‌’ తర్వాత ఏ చిత్రానికి సైన్‌ చేయలేదని వెల్లడించారు. తన కూతురు రాహాతో సమయాన్ని గడపాలనుకుంటున్నానని.. అందుకే సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా రణ్‌బీర్‌ మాట్లాడుతూ ‘‘యానిమల్‌’ తర్వాత నేను మరే ఇతర చిత్రానికీ కమిట్‌ కాలేదు. కొన్ని రోజులు నా కూతురు రాహాతో గడపాలనుకుంటున్నా. నా బిజీ షెడ్యూల్‌ కారణంగా రాహా పుట్టిన తర్వాత తొలి నెలల్లో తనతో ఎక్కువ సేపు టైమ్‌ స్పెండ్‌ చేయలేకపోయాను. అందుకే, ఇప్పుడు లాంగ్‌ బ్రేక్‌ తీసుకుని 6 నెలల పాటు ఇంట్లోనే ఉంటూ తనతో సమయాన్ని గడపాలనుకుంటున్నా’ అని వెల్లడించారు. ఇదే సమయంలో కుమార్తె రాహా గురించి రణ్‌బీర్‌ మాట్లాడుతూ ‘రాహా ఇప్పుడే ఇళ్లంతా తిరుగుతూ.. అన్నింటినీ గుర్తిస్తోంది. ప్రేమను వ్యక్తపరుస్తోంది. అమ్మ, నాన్న వంటి పదాలను పలికేందుకు ప్రయత్నిస్తోంది. తండ్రిగా ఈ అందమైన క్షణాలను ఆస్వాదించాలనుకుంటున్నా.

ఈ ఆరు నెలలు పూర్తిగా తనతోనే గడుపుతా’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ను రణ్‌బీర్‌ గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి గతేడాది నవంబర్‌ 6న రాహా జన్మించింది.

అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన చిత్రం యానిమల్‌. భద్రకాళి పిక్చర్స్‌, టీ సిరీస్‌ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, ప్రణయ్‌రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కు జోడీగా నేషనల్‌ క్రష్‌ రష్మిక నటిస్తోంది. గీతాంజలిగా ఆమె ఈ చిత్రంలో కనిపించనుంది. ఇందులో బల్బీర్‌ సింగ్‌గా అనిల్‌ కపూర్‌ నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 1న విడుదల కానుంది.