నేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ డ్రామా ఇప్పటికే మంచి అంచనాల మధ్య విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని ప్రేక్షకులు థియేటర్ లోనే కన్ఫర్మ్ చేసుకున్నారు.
ఇప్పటి వరకు వదంతుల్లా వినిపించిన కోలీవుడ్ స్టార్ కార్తి గెస్ట్ రోల్ నిజమైంది. క్లైమాక్స్లో రత్నవేలు పాండియన్ అనే పోలీస్ అధికారి పాత్రలో కార్తి సందడి చేశారు. “దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అంటూ శ్రీ గురజాడ అప్పారావు చెప్పిన మాటలను తనదైన స్టైల్లో పునరావృతం చేస్తూ ఆయన ఎంట్రీ ఇవ్వడంతో థియేటర్లలో ఫాన్స్ లో పలుకుబడి ఉన్న కేరక్టర్లా ఫీల్ చేశారు.
ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ఒక గెస్ట్ రోల్ అయినా, ‘హిట్’ యూనివర్స్లో ఇది నూతన టర్నింగ్ పాయింట్గా మారిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు ‘హిట్’ 1, 2లో క్లైమాక్స్లో కనిపించిన హీరోలే తదుపరి సినిమాల్లో లీడ్ రోల్స్ పోషించిన ఉదాహరణల్ని చూస్తే.. హిట్ 4లో హీరోగా కార్తి ఫిక్స్ అయిపోయాడని స్పష్టమవుతోంది.
ఇక హిట్ 4లో కార్తి ప్రధాన పాత్రలో నటిస్తే, ఈ సిరీస్ మరింత పాన్ ఇండియా స్థాయికి చేరే అవకాశం ఉంది. తమిళంలో ఇప్పటికే తనకంటూ బలమైన ఇమేజ్ ఉన్న కార్తి, హిట్ యూనివర్స్లో అడుగు పెట్టడం సిరీస్ క్రేజ్ను రెట్టింపు చేయనుంది. మరి దర్శకుడు శైలేశ్ కొలను ఈ అవకాశం ఎలా మలచుకుంటారో వేచి చూడాలి.