సంక్రాంతిబరిలో అగ్రహీరోలు.. మహేశ్‌ బాబు, నాగార్జున, వెంకీల చిత్రాలు విడుదల

సంక్రాంతికి థియేటర్లు అన్నీ కళకళలాడనున్నాయి. చాలారోజుల తర్వాత సీనియర్‌ హీరోలు అయిన వెంకటేశ్‌, నాగార్జున.. సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్నారు. ఇక వీరితో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా యాడ్‌ అయ్యారు. వీరితో పాటు కంటెంట్‌ను నమ్మి బరిలోకి దిగుతామంటూ యంగ్‌ టాలెంట్‌ తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కూడా సిద్ధమయ్యారు. ఇక సంక్రాంతి రేసులో నిలబడిన తెలుగు సినిమాలకే థియేటర్లు దొరకక ఇబ్బందులు పడుతుంటే.. ఒక తమిళ డబ్బింగ్‌ చిత్రం కూడా పోటీకి సిద్ధమయ్యింది.

ముందుగా సంక్రాంతి బరిలో దిగనున్న అన్ని సినిమాల్లో ‘గుంటూరు కారం’కే ఎక్కువగా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. టాలీవుడ్‌లో మహేశ్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కు ఒక రేంజ్‌లో క్రేజ్‌ ఉంది. ఇప్పటివరకు వీరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు రాగా.. హ్యాట్రిక్‌ చిత్రంగా తెరకెక్కింది ‘గుంటూరు కారం’. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాలో మహేశ్‌ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది. సెకండ్‌ హీరోయిన్‌గా విూనాక్షి చౌదరి నటించింది. ప్రకాశ్‌ రాజ్‌, ఈశ్వరి రావ్‌, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ‘గుంటూరు కారం’కు తమన్‌ అందించిన మ్యూజిక్‌.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

‘గుంటూరు కారం’తో పోటీ అయినా పరవాలేదని, తమ కంటెంట్‌ విూద తమకు నమ్మకంతో ఉందని అదే రోజు విడుదలకు సిద్ధమయ్యారు ‘హనుమాన్‌’ మేకర్స్‌. తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ కేవలం తెలుగులోనే కాకుండా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అవ్వనుంది. తెలుగులో మొదటి సూపర్‌ హీరో సినిమాగా తెరకెక్కిన ‘హనుమాన్‌’.. ’గుంటూరు కారం’కు పోటీగా థియేటర్లను దక్కించుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే విడుదలయిన ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అమృతా అయ్యర్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌.. ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

జనవరి 12న పోటీలో నలిగిపోకూడదనే ఉద్దేశ్యంతో జనవరి 13న తన సినిమా ‘సైంధవ్‌’ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు వెంకటేశ్‌. తన కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్‌’ను ‘హిట్‌’ ఫ్రాంచైజ్‌ ఫేమ్‌ శైలేష్‌ కొలను డైరెక్ట్‌ చేశాడు. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ ట్రైలర్‌ చూస్తుంటే సినిమాలో సెంటిమెంట్‌తో పాటు వయొలెన్స్‌, యాక్షన్‌ కూడా ఉండనుందని అర్థమవుతోంది.

ఇక ‘సైంధవ్‌’లో వెంకీ మామకు జోడీగా శ్రద్దా శ్రీనాథ్‌ నటించగా.. బేబీ సారా కీలక పాత్రలో కనిపించనుంది. ఆండ్రియా, ఆర్య, నవాజుద్దీన్‌ సిద్ధికీ.. ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకటేశ్‌తో పాటు మరో సీనియర్‌ హీరో నాగార్జున కూడా ఈసారి సంక్రాంతిలో పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. విజయ్‌ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగ్‌ నటించిన చిత్రమే ‘నా సామిరంగ’. ఈ మూవీ జనవరి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. నాగార్జునతో పాటు అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌లు కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. అషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. కీరవాణి అందించిన మ్యూజిక్‌.. విలేజ్‌ ఫీల్‌ ఇస్తుందని విడుదలయిన పాటలు విన్న ప్రేక్షకులు అనుకుంటున్నారు.

ఇక జనవరి 12న రెండు తెలుగు చిత్రాలకు పోటీగా ఒక తమిళ చిత్రం కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యింది. అదే శివకార్తికేయన్‌ హీరోగా నటించిన ‘అయాలన్‌’. ఈ మూవీ ఎంతోకాలంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌లోనే ఆగిపోయింది. ఫైనల్ గా రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యి.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసింది. వీటితో పాటు ధనుష్‌ నటించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ కూడా జనవరి 12న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ తెలుగులో భారీ పోటీ ఉండడం వల్ల కేవలం తమిళనాడులో మాత్రమే విడుదల అవుతున్నట్టు సమాచారం.