చిరంజీవి లేక‌పోయిన కూడా, ఆచార్య షూటింగ్ మొద‌లు పెట్టిన మేక‌ర్స్

మెగాస్టార్ చిరంజీవి, క‌లువ క‌ళ్ళ సుందరి కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆచార్య‌. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ నేప‌థ్యంలో ఆచార్య చిత్రం తెర‌కెక్కుతుండగా, ఇందులో పవర్‌ఫుల్‌ దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారి పాత్రలో కనిపించనున్నారు చిరు. ఇప్ప‌టికే ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన లుక్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల అంచ‌నాలు మ‌రింత పెంచేసింది.

అభిమానుల అంచ‌నాల‌ని మించేలా ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కొర‌టాల శివ‌. ఇందులో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ సైతం ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ల సమయంలో రామ్ చరణ్‌ది ఓ పవర్ ఫుల్ నక్సలైట్ పాత్ర అని అంటున్నారు. 70 శాతం పూర్తైన ఈ చిత్ర షూటింగ్‌ని న‌వంబ‌ర్ 9 నుండి మొద‌లు పెట్టాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని చిరంజీవికి కరోనా తెలియ‌డంతో సైలెంట్ అయ్యారు. చిరు క‌రోనా నుండి కోలుకున్నాకే తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతుందని అభిమానులు అనుకున్నారు. కాని ఆచార్య షూటింగ్‌ని క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ మొద‌లు పెట్టారు.

సింగిల్ షెడ్యూల్‌లో ఆచార్య చిత్ర షూటింగ్‌ని పూర్తి చేస్తామ‌ని మేక‌ర్స్ అంటున్నారు. చిరు క‌రోనా నుండి కోలుకునే లోపు చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌కు సంబంధించి  కీల‌క స‌న్నివేశాలు షూట్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. తాజాగా ఆచార్య సెట్‌లో ద‌ర్శ‌కుడికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇందులో ద‌ర్శ‌కుడితో పాటు మిగ‌తా చిత్ర బృందం మాస్క్‌తో పాటు ఫేస్ షీల్డ్ పెట్టుకొని క‌నిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం హ‌నీమూన్ టూర్‌లో బిజీగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ త్వ‌ర‌లోనే ఆచార్య టీంతో క‌ల‌వ‌నుంది.