కష్టాలను తట్టుకుని ముందుకు సాగా : మాస్‌ మహారాజా రవితేజ

టాలీవుడ్‌ మాస్‌ మహారాజా రవితేజ తొలిసారి పాన్‌ ఇండియా సినిమా ‘టైగర్‌ నాగేశ్వర రావు’తో ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది రవితేజ టీం.

ప్రమోషన్స్‌ టైంలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌తో అభిమానుల్లో జోష్‌ నింపుతున్నాడు. తాను ఈ స్థాయికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఇప్పుడు కెరీర్‌ తొలినాళ్లలో తాను పడ్డ ప్రతీ కష్టాన్ని, ఇబ్బందులను ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చాడు రవితేజ. కెరీర్‌లో నిలదొక్కుకునే సమయంలో ప్రతి ఒక్క రోజును గుర్తుంచుకుంటా.

ప్రతీ కష్టాన్ని ఎంజాయ్‌ చేస్తా. నేనెప్పుడూ నిరాశ పడలేదు. ఏదో ఒక రోజు నిలదొక్కుకుంటానని నాకు తెలుసు.. అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్‌ ప్రతీ ఒక్కరిలో స్పూర్తి నింపుతున్నాయి. ఇటీవలే హిందీ ప్రమోషన్స్‌ లో భాగంగా జరిపిన చిట్‌చాట్‌లో అనుపమ్‌ ఖేర్‌, రవితేజ మధ్య జరిగిన ఓ సంఘటన తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

1988లో రవితేజ నాతో ఫొటో దిగుతానని అడిగాడు. కానీ నేను తిరస్కరించానన్నాడు అనుపమ్‌ ఖేర్‌. అయితే అప్పట్లో తన దురుసు ప్రవర్తనను గుర్తు చేసుకొని.. రవితేజకు క్షమాపణలు చెప్పారు అనుపమ్‌ ఖేర్‌. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది.

1970స్‌ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరు గాంచిన టైగర్‌ నాగేశ్వర్‌ రావు జీవిత కథగా పాన్‌ ఇండియా స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్‌ బ్యూటీ కృతిసనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది.