తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలిష్ డైలాగులు, హ్యూమర్తో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు. ఇప్పటివరకు స్టార్ హీరోలతో హిట్ల మీద హిట్ల్ కొట్టిన ఈ మాటల మాంత్రికుడు ఇప్పుడు కొత్త ఎక్స్పెరిమెంట్కి రెడీ అవుతున్నట్టు టాక్. ఇది కథ పరంగా కాదు, కథానాయిక పరంగా.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటల ప్రకారం, త్రివిక్రమ్ మొదటిసారి ఓ లేడీ ఓరియెంటెడ్ కథపై పని చేస్తున్నారు. అది కూడా సమంత కోసం! గతంలో ‘అ ఆ’ సినిమాతో సమంతకు మంచి బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్, ఆమె టాలెంట్కి ఫిదా అయిపోయారని అప్పట్లోనే తెలిసింది. తాజాగా బాలీవుడ్ ప్రయాణం నిమిత్తం ముంబైకి మకాం మార్చిన సమంతను మళ్లీ తెలుగు తెరపైకి తీసుకురావడానికి ఇదే ప్రయత్నమంటూ టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఆలస్యంతో ఫ్రీగా ఉన్న త్రివిక్రమ్, వెంకటేష్ సినిమా కోసం స్క్రిప్ట్ ఫినిష్ చేసి షూటింగ్ కోసం వేచి చూస్తున్నారు. ఈ గ్యాప్లో సమంత కోసం ఓ ఎమోషనల్ డ్రామా కథను సిద్ధం చేస్తున్నారట. మహిళా పాత్ర బలంగా నిలిచే కథ కావడంతో సమంతకు ఇది మరొక రీఎంట్రీలా ఉంటుందన్న అభిప్రాయం ఉంది.
‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అ ఆ’ల తర్వాత సమంత-త్రివిక్రమ్ కాంబో మళ్లీ రిపీట్ అయితే ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. సమంతకు ప్రస్తుతం తెలుగు సినిమా నుంచి సరైన కథలు అందడం లేదు. అలాంటి సమయంలో త్రివిక్రమ్ తీసుకొస్తున్న కథ ఆమెను మరోసారి టాప్ స్థాయికి చేర్చే అవకాశం ఉండొచ్చు.