మార్చి 29న డేట్‌ ఫిక్స్‌ చేసిన ‘టిల్లు స్క్వేర్‌’!

సిద్ధు జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్‌ జంటగా వస్తున్న ‘టిల్లు స్క్వేర్‌’ సినిమా కొత్త విడుదల తేదీని ఖరారు చేసింది. ఈ సినిమా ఇప్పటికి రెండు మూడు తేదీలను ప్రకటించి వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఒక కొత్త తేదీని అంటే మార్చి 29న విడుదలవుతోందని చిత్ర నిర్వాహకులు ప్రకటించారు. మళ్ళీ మార్పులు లేకుండా ఇదే తేదీని ఖరారు చేస్తారని అనుకుంటున్నారు.

ఇంతకు ముందు సిద్ధు నటించిన ‘డీజీ టిల్లు’ కి ఈ సినిమా సీక్వెల్‌ గా వస్తోంది. అయితే మొదటి దానిలో నేహా శెట్టి కథానాయిక కాగా, ఈ ‘టిల్లు స్క్వేర్‌’లో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి కూడా. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌ ‘కిల్లర్‌’ లుక్స్‌ ఇప్పటికే బాగా పాపులర్‌ అయ్యాయి.

మార్చి 29 అనగానే అప్పటికి వేసవి సెలవులు మొదలవుతాయి కాబట్టి ఈ సినిమాకి అది మంచి విడుదల తేదీగా చిత్ర నిర్వాహకులు భావించవచ్చు అని అంటున్నారు. కానీ ఆ సమయంలో పార్లమెంటుకి, ఆంధ్రాలో అసెంబ్లీ కి ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే మాత్రం అప్పుడు ఈ సినిమా విడుదల తేదీలో మార్పులు ఏమైనా ఉండొచ్చేమో అని కూడా అంటున్నారు.

ఈ సినిమాకి మల్లిక్‌ రామ్‌ దర్శకుడు, సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. ఈ సినిమాకి ప్రముఖ గాయకుడు రామ్‌ మిరియాల సంగీతాన్ని అందించటమే కాకుండా అతను పాడిన పాటలు ‘టిక్కెట్టే కొనకుండా’, ‘రాధిక’ పాటలు బాగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి గత సంవత్సరం నుండి వార్తల్లో వుంది, విడుదల తేదీలు, ప్రచార చిత్రాలతో, ఎట్టకేలకి ఇప్పుడు ఒక విడుదల తేదీ ఖరారు చేశారు.