సీనియర్ స్టార్స్ చితకట్టేశారుగా..

చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా సినిమా హిట్​ అవ్వాలంటే సరైన కథ ఉండాల్సిందే. అందుకే కథల ఎంపికలో తారలు ఆచితూచి అడుగులేస్తుంటారు. అయితే ఈ కథల ఎంపికల విషయంలో ఒక్కో హీరో ఒక్కో స్ట్రాటజీ ఫాలో అవుతుంటారు. వారి బాడీ లాంగ్వేజ్​కు సెట్ అయ్యే విధంగా అలాగే అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా భిన్నమైన కథలను ఎంచుకుంటారు. అలా ఒక్కో హీరో ఒక్కో రకం కథలపై ఆసక్తి చూపిస్తుంటారు. అయినా కొన్ని సందర్భాల్లో అవి బోల్తా కొడుతుంటాయి. అయితే చిన్న హీరోల విషయాన్ని పక్కనపెడితే ఇండస్ట్రీలో టాలీవుడ్​, బాలీవుడ్​, కోలీవుడ్​, మాలీవుడ్​ అని తేడా లేకుండా అన్ని చిత్రీసీమల్లో మూల స్థంభాలుగా ఉన్న కొంతమంది అగ్ర హీరోలు.. ప్రస్తుతం జోరు మీదున్నారు. చాలా కాలంగా సరైనా హిట్​ లేక డీలా పడిన వారు.. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమాతో భారీ హిట్​ అందుకుని బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకున్నారు. ఇక తమ పని అయిపోయింది అనుకున్నవారికి గట్టి సమాధానం ఇచ్చారు. అదిరిపోయే కమ్​ బ్యాక్​ ఇచ్చి తమ అభిమానులు కాలరు ఎగరేసుకునేలా చేశారు. కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస ప్రాజెక్ట్​లను పట్టాలెక్కిస్తున్నారు. యంగ్ స్టార్స్ ను పక్కకు నెట్టి దూసుకుపోతున్నారు. ఆ వివరాలు..

మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి దేశం గర్వించదగ్గ అత్యుత్తమ నటుల్లో ఒకరు. అయితే ఆయన కొంతకాలంగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సెలెక్టివ్‌గా కథా బలమున్న చిత్రాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే ఆయన గతేడాది… అమల్ నీరద్ దర్శకత్వంలో నటించిన భీష్మ పర్వం చిత్రం మాత్రం మరోసారి పాత మమ్ముట్టిని సిల్వర్ స్క్రీన్‌పై చూపించింది. ఈ సినిమా ద్వారా మమ్ముట్టి తనను తాను రీఇన్వెంట్ చేసుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులకు, అభిమానులకు కిక్ ఇచ్చారు. తన కెరీర్​లో అతిపెద్ద హిట్​ను అందుకుని గట్టి కమ్​ బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రం రూ.50కోట్లకు పైగా కలెక్షన్స్​ను అందుకుంది.

చాలా కాలంగా ఫ్లాప్​లతో సతమతమవుతున్నా యూనివర్సల్​ స్టార్ కమల్​హాసన్​ గతేడాది విక్రమ్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండియా వైడ్​గా బ్లాక్ బస్టర్​ హిట్​ను అందుకున్నారు. లోకేష్ కనగరాజ్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. సినీ, యాక్షన్‌ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. కమల్‌ హాసన్‌, ఫహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రూ.500 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్ర విజయంతో కమల్​ తన అప్పులను కూడా తీర్చుకుంటానన్నారు. ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రంలో నటిస్తున్నారు.

బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’. దీపికా పదుకొణె హీరోయిన్. విడుదలకు ముందు విమర్శలతో టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు విడుదల అనంతరం అత్యధిక వసూళ్లను సాధిస్తోంది. జీరో వంటి ఫ్లాఫ్​ తర్వాత సరైన్​ హిట్​ కోసం ఏకంగా ఐదేళ్ల పాటు గ్యాప్​ ఇచ్చి మరీ పఠాన్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కింగ్ షారుDక్​. ఈ చిత్రం తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డు వర్షం కురిపిస్తోంది. రోజుకో వంద కోట్లు చెప్పున ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ కలెక్షన్స్​ చూసి అభిమానులు, ఇండస్ట్రీ వారికి మైండ్​ బ్లాంక్ అవుతోంది. ఇప్పటివరకు ఏకంగా రూ.650కు పైగా వసూళ్లనను సాధించింది. దీంతో అభిమానులు కింగ్​ ఈజ్ బ్యాక్​ అని అంటున్నారు.

ఆచార్యతో డిజాస్టర్​ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి గాఢ్​ఫాదర్​తో సక్సెస్​ అందుకున్న తన రేంజ్​కు తగ్గ హిట్​ కాదు అది. దీంతో అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. అయితే ఏమాత్రం తగ్గని చిరు.. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చి.. బాక్సాఫీస్​ను షేక్​ చేశారు. సంక్రాంతి హీరోగా నిలిచారు. ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్లుకు పైగా వసూళ్లను అందుకుని వింటేజ్​ చిరంజీవిని గుర్తుచేసింది. అభిమానుల్లో ఫుల్​ జోష్​ను నింపింది. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ, శృతిహాసన్ నటించారు.