ముఖ్యమంత్రిని చేస్తే 150 ఏళ్ళ రహస్యం

ఒకప్పుడు హీరోగా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ యాక్టర్ శరత్ కుమార్. అతను నటుడిగానే కాకుండా ఒక పార్టీ స్థాపించి తమిళనాట రాజకీయ నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు. సమత్తువ ముక్కల్ కట్చి ఆమె పార్టీతో ఎన్నికలలో పోటీ చేసిన అంతగా ప్రభావం చూపించలేకపోయారు.

ఇదిలా ఉంటే తాజాగా శరత్ కుమార్ తన పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాట వైరల్ గా మారాయి. అలాగే సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఎన్నికలలో తనని ముఖ్యమంత్రిగా చేస్తే 150 ఏళ్ళు జీవించే రహస్యం చెబుతానని శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తానూ 150 ఏళ్ళు బ్రతికే రహస్యం తెలుసుకున్నానని అయితే ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలందరికి చెబుతానని చెప్పుకొచ్చారు. మద్యపాన మనిషి ఎదుగుదలని నియంత్రిస్తూ మానసిక ఒత్తిళ్ళకి కారణం అవుతుందని అన్నారు. ఇతర వ్యసనాలు కూడా మానసికంగా మనిషిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. 2025 నాటికి దేశంలో యువశక్తి పెరుగుతుందని అన్నారు.

భారత్ లో య యువశక్తిని నియంత్రించేందుకు విదేశాల నుంచి మత్తు పదార్ధాలని అక్రమంగా రవాణా చేస్తున్నారని, తక్షణమే దీనిని అరికట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరారు. ఇలా చేయడం వలన దేశంలో యువశక్తిని కరెక్ట్ గా ఉపయోగించుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేయోచ్చని అన్నారు.

ఇక ఈ పార్టీ సమావేశంలో శరత్ కుమార్ చేసిన 150 ఏళ్ళు జీవించే రహస్యం గురించి ఇప్పుడు తమిళనాట ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి శరత్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం. మరి ఈ వ్యాఖ్యలపై శరత్ కుమార్ మళ్ళీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేదంటే వాటికే కట్టుబడి ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. శరత్ కుమార్ లాంటి స్టార్ యాక్టర్ చేసిన ఈ కామెంట్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా ట్రోలింగ్ జరుగుతూ ఉండటం విశేషం.