సంక్రాంతికి బీడీల గోల.. మహేష్, నాగ్‌ల చిత్రాల పోస్టర్లపై చర్చ

మహేష్‌ బాబు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ లో ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వేగం చూస్తుంటే, సంక్రాంతికి అనుకున్న తేదీకి మహేష్‌ బాబు సినిమా విడుదల అవొచ్చు అని అంటున్నారు. అంత వేగంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తీస్తున్నారని ఒక టాక్‌ నడుస్తోంది. చాలామంది కాంబినేషన్‌ నటులు వున్నా, అందరికీ ముందే చెప్పి పెట్టుకొని ఈ సినిమా షూటింగ్‌ కోసం మూడు హౌస్‌ సెట్లు వేశారని, ఎవరు దొరికితే ఆ సంబంధిత ఇంట్లో షూటింగ్‌ చేస్తున్నారని తెలిసింది.

కథానాయకుడు అయిన మహేష్‌ బాబు హౌస్‌ సెట్‌, అలాగే ప్రకాష్‌ రాజ్‌ ఆఫీస్‌ సెట్‌, ఇంకోటి కథానాయిక అయిన శ్రీలీల హౌస్‌ సెట్‌ ఇలా మూడు సెట్లు వేశారని, కాంబినేషన్‌ చూసుకుంటూ చక చకా షూటింగ్‌ చేసేస్తున్నారని కూడా తెలిసింది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ, రావు రమేష్‌, రోహిణి, మురళి శర్మ, జయరాం, రాహుల్‌ రవీంద్రన్‌, రవి శంకర్‌, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌ ఇలా చాలామంది క్యారెక్టర్‌ నటులు వున్నారని తెలిసింది. ఈ సినిమా నుండి టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదలయ్యాయి, అందులో మహేష్‌ బాబు బీడీ కలుస్తూ, లుంగీ కట్టుకొని వున్న ఫోటోస్‌ బాగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అలాంటింది అంటే అదే బీడీ, లుంగీ లుక్‌ లో ఒక సీనియర్‌ నటుడు నాగార్జున కూడా కనిపించనున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ’నా సామి రంగా’ టీజర్‌ లో నాగార్జున బీడీ కలుస్తూ, లుంగీ కట్టిన సన్నివేశం చూసాం. విజయ్‌ బిన్నీ దీనికి దర్శకుడు కాగా, ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల అని టీజర్‌ లో విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. అంటే ఈ రెండు బీడీలు, లుంగీ లు కట్టుకున్న కథానాయకుల సినిమాలు సంక్రాంతికి పోటీ పడనున్నాయి అని అర్థం అవుతోంది.

ఇదేంటి ఈ సంక్రాంతి పండగకి ఈ బీడీల గోల అని నెటిజన్స్‌ ఒకటే కామెంట్‌ చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఇంచు మించు ఒకటే లుక్‌ లో కనపడుతున్నారు, అలాగే ఇద్దరూ సంక్రాంతి పండగకు వస్తున్నారు, మరి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. అయితే సంక్రాంతికి ఎటువంటి సినిమా అయినా ఆ నాలుగు రోజులు బాగానే నడుస్తుంది అని, అందుకనే ఇద్దరూ సంక్రాంతికి వస్తున్నారని ఒక టాక్‌ నడుస్తోంది.