‘యానిమల్‌’ చిత్రంపై ఆగని విమర్శల దుమారం.. జావేద్‌ అక్తర్‌…. కిరణ్‌ రావులకు వంగా ఘాటు సమాధానం!

‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. అదే చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘కబీర్‌ సింగ్‌’ టైటిల్‌తో తెరకెక్కించి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘యానిమల్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని మరో మెట్టు ఎక్కారు. అయితే ఈ చిత్రం ఎంతగా సక్సెస్‌ అయిందో అంతే విమర్శలు ఎదుర్కొంది. పలు సినీ సెలబ్రిటీలు ‘యానిమల్‌’ చిత్రాన్ని, చిత్ర దర్శకుడిని విమర్శిస్తూ మాట్లాడారు.

ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ కూడా ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజులకు ఈ సన్నివేశంపై పరోక్షంగా విమర్శించారు. ఇలాంటి చిత్రాలు సమాజానికి ప్రమాదకరమన్నారు. దీనిపై సందీప్‌ ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ‘విూర్జాపుర్‌’ సిరీస్‌లో ఎన్నో అభ్యంతరకరమైన పదాలున్నాయి. ఆ సినిమాను నిర్మించిన ఫర్హాన్‌ అక్తర్‌కు సలహా ఇవ్వమనండి. ప్రపంచంలో ఉన్న అసభ్య పదాలన్నీ ఈ చిత్రంలోనే ఉన్నాయి.

నేను దాన్ని పూర్తిగా చూడలేదు. ప్రకటనల్లో వచ్చిన సీన్స్‌ చూసే వాంతి వచ్చిన ఫీలింగ్‌ కలిగింది. ముందు తన కుమారుడు నిర్మించే వాటిపై జావేద్‌ను శ్రద్థపెట్టమనండి‘ అని ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా చర్చ జరిగింది. ఇటీవల ఓ వేదికపై ఆమీర్‌ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌ రావు కూడా పేరు చెప్పకుండా సందీప్‌రెడ్డి వంగాను విమర్శించారంటూ బాలీవుడ్‌లో వార్తలొచ్చాయి.

దీనిపై సందీప్‌ పేరు ప్రస్తావన లేకుండా కిరణ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చారు. నా సినిమాపై కామెంట్‌ చేసే ముందు మీ భర్త నటించిన ‘దిల్‌’ సినిమా ఓ సారి చూడండి’ అని సమాధానమిచ్చారు. దీనిపై కిరణ్‌ రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నేను ప్రత్యేకించి సందీప్‌ చిత్రాల గురించి మాట్లాడలేదు. కొన్ని సినిమాల్లో స్త్రీలను కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని అన్నాను. ఇదే విషయం నేను గతంలోనూ చాలా వేదికలపై మాట్లాడాను. నేను తన సినిమాల గురించే మాట్లాడుతున్నానని ఎందుకు ఊహించుకున్నారో నాకు తెలియదు. మీరు ఈ విషయం ఆయన్నే అడిగి తెలుసుకోండి’ అని అన్నారు.