స్పోర్ట్స్ డెస్క్: RCB vs RR: బెంగళూరు వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ 18 సీజన్లో సొంత గడ్డపై మొదటి విజయం అందుకున్న బెంగళూరు, ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు (8 ఫోర్లు, 2 సిక్స్లు)తో రాణించగా, దేవ్దత్ పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్స్లు) చేశారు. చివర్లో జితేశ్ శర్మ 10 బంతుల్లో 20*, టిమ్ డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులతో స్కోరు వేగంగా పెంచారు. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు మాత్రమే చేయగలిగింది. యశస్వీ జైస్వాల్ 49 మంచి ఆరంభం ఇవ్వగా, ధ్రువ్ జురెల్ 47 పరుగులతో పోరాడినా చివరి ఓవర్లలో బలహీనంగా పతనమయ్యారు.
19వ ఓవర్లో హేజిల్వుడ్ కేవలం 1 పరుగే ఇవ్వడం, చివరి ఓవర్లో యశ్ దయల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం మ్యాచ్ను బెంగళూరు దక్కించుకోవడానికి కారణమయ్యాయి. చివరి వరకు బాగానే వచ్చిన RR చివరి రెండు ఓవర్లలోనే మ్యాచ్ ను చేజార్చుకుంది. బెంగళూరు బౌలర్లలో హేజిల్వుడ్ 4 వికెట్లు (4 ఓవర్లలో 23 పరుగులు), కృనాల్ పాండ్య 2, భువనేశ్వర్ కుమార్, యశ్ దయల్ చెరో వికెట్ తీసారు.
రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2, జోఫ్రా ఆర్చర్, హసరంగ చెరో వికెట్ తీసారు. ఈ గెలుపుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో పోటీ కొనసాగిస్తోంది. మరోవైపు, రాజస్థాన్ వరుస పరాజయాలతో ఒత్తిడిలో పడింది. కీలక సమయంలో బెంగళూరు బౌలింగ్ అద్భుతంగా నిలిచింది. ఇక ప్లేఆఫ్ బెర్త్ కోసం బెంగళూరు పూర్తి జోరుగా పోటీలో నిలవనుంది.