ఛలో బ్యూటీ రష్మిక మందాన్న సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెరపై ఎంత చలాకీగా ఉంటుందో తెర వెనుకా అంతే సందడిగా ఉంటుంది. రష్మిక చేష్టలు చూస్తుంటే ఒక్కోసారి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదేమోనన్న అనుమానం కూడా వస్తుంది. ఇక రష్మిక తన తండ్రి గురించి చెబుతు ఆ మధ్య ఎంతగా ఎమోషనల్ అయిందో.. కవిత్వాలు రాసిందో అందరకీ తెలిసిందే. తండ్రీ కూతుళ్ల బంధం ఎలా ఉండాలి, తన తండ్రికి తానంటే ఎంత ప్రేమ.. తనకు తన తండ్రి అంటే ఎంత ప్రేమో చెబుతూ ఓ సుధీర్ఘమైన వ్యాసం రాసింది.
ఇక తన చిట్టి చెల్లి శిమన్ మందాన్న అంటే మరింత మక్కువ. చిన్న పిల్ల కావడంతో మరింత గారాబం చేస్తూ ఉంటుంది. అంత పెద్ద రష్మికకు అంత చిన్న చెల్లి అంటే ఎవ్వరూ నమ్మరు. అందుకే తన చిట్టిసోదరిని మరింత ప్రేమగా చూసుకుంటుంది. తాజాగా రష్మిక ఓ ఫోటోను షేర్ చేసింది. ఆదివారం వస్తే వాళ్లింట్లో ఎలా ఉంటుందో చెబుతూ ఆసక్తికరమైన కామెంట్ చేసింది.
మామూలుగా పందుల గుంపు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అన్ని పందులు ఒకే చోట ఉంటాయి. అలానే ఓ మూడు పందులు ఒకేచోట పడుకుని ఉన్నాయి. ఒక దానిపై ఒకటి అలా పడుకుని ఎంతో ముద్దుగా ఉన్నాయి. ఆ మూడింటిలానే తాము ఇంట్లో ఉంటామని రష్మిక చెప్పుకొచ్చింది. రష్మిక మందాన్నపై చెల్లి ఎక్కి ఆడుకుంటుందని, పడుకుంటుందని చెప్పకనే చెప్పింది. మొత్తానికి రష్మిక చేసిన పోలిక కాస్త వెరైటీగా ఆమె భావం మాత్రం సరిగ్గానే ఉంది. ఆదివారం వస్తే ఫ్యామిలీ అంతా ఒకే చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తారన్నమాట.