‘కమిటీ కుర్రోళ్ళు’ నిర్మాత నీహారిక కు అభినందనల వెల్లువ!

నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’తోనే విజయాన్ని అందుకున్నారు నిహారిక. 16 మంది కొత్త నటీనటులతో ‘కమిటీ కుర్రోళ్ళు’ ను నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. దీంతో సినీ సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాజాగా రామ్‌ చరణ్‌ ఈ సినిమాను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టారు. ’నిహారిక.. ఘన విజయాన్ని సాధించినందుకు అభినందనలు. ఈ విజయానికి నువ్వు అర్హురాలివి. నీ టీమ్‌తో కలిసి నువ్వు పడిన కష్టం.. నీ కృషి, అంకిత భావం నిజంగా స్ఫూర్తిదాయకం. ‘కమిటీ కుర్రోళ్ళు’లో భాగమైన అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఈ కథకు జీవం పోసిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేక అభినందనలు’ అని పేర్కొన్నారు.

తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే హీరో నానితో పాటు.. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌, స్టార్‌ డైరెక్టర్‌లు నాగ్‌ అశ్విన్‌, క్రిష్‌, సుకుమార్‌లు ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్‌ను అభినందించారు. నూతన దర్శకులు, నటీనటులను ప్రోత్సహించాలని, కొత్త కథలను ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో నటి నిహారిక దీన్ని నిర్మించారు.

గ్రావిూణ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథతో వంశీ దీనిని రూపొందించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ సినీప్రియుల ఆదరణను సొంతం చేసుకుంది. ఈ విజయం పై నిహారిక మాట్లాడుతూ.. తాను జీవితంలో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల్లో నిర్మాతగా మారడం ఒకటన్నారు.