స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ కు క‌రోనా పాజిటివ్.. ఎలాంటి లక్ష‌ణాలు లేవ‌ని వెల్ల‌డి

రామ్ చ‌ర‌ణ్ కు క‌రోనా పాజిటివ్.. 2020 ముగుస్తున్న‌ప్ప‌టికీ క‌రోనా ఉదృతి త‌గ్గడం లేదు. రూపాంత‌రాలు మార్చుకొని మ‌రీ వ‌ణికిస్తుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా కరోనా బారిన ప‌డుతుండ‌డం అంద‌రిలో ఆందోళ‌న క‌లిగిస్తుంది. కరోనా వ‌ల‌న దిగ్గ‌జ నాయ‌కుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు మృత్యువాత‌ప‌డ్డారు. కొంద‌రు కోలుకున్నారు. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

రామ్ చ‌ర‌ణ్ కొద్ది సేపటి క్రితం త‌న ట్విట్ట‌ర్‌లో త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని తెలియ‌జేస్తూ, ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. రానున్న రోజుల‌లో మ‌రింత శ‌క్తివంతంగా మీ ముందుకు వ‌స్తాను అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు చెర్రీ. ఈ మెగా హీరో డిసెంబ‌ర్ 9న త‌న ఫ్యామిలీతో క‌లిసి నిహారిక పెళ్లి వేడుక‌లో పాల్గొన్నాడు. అక్క‌డ దిగిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇక రీసెంట్‌గా త‌న ఇంట్లో మెగా ఫ్యామిలీకి క్రిస్మ‌స్ పార్టీ కూడా ఇచ్చాడు. ఈ పార్టీలో వ‌రుణ్ తేజ్ , అల్లు అర్జున్, సాయిధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్, నిహారిక‌, క‌ళ్యాణ్ దేవ్ ఇలా మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. మాస్క్‌లు లేకుండా వీరంతా పార్టీ లో పాల్గొన‌గా, ఇప్పుడు వారి ఆరోగ్య ప‌రిస్థితిపై అభిమానుల‌లో ఆందోళ‌న నెల‌కొంది.