రామోజీలో ‘పుష్ప-2’ హంగామా!

ఇటీవల ఒరిస్సాలోని మల్కాన్‌గిరి ప్రాంతంలో కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘పుష్ప-2’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. గత షెడ్యూల్‌లో ఫవాద్‌ ఫాజిల్‌తో పాటు కీలక పాత్రధారులు పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఎర్ర చందనం ఎగుమతి చేసే కూలీలను పట్టుకుని పుష్ప జాడ తెలుసుకునేందుకు షెకావత్‌ పాత్రధారి పహాద్‌ ఫాజిల్‌ కూలీ వేషం వేసి ఆ గుంపులు కలిసి పట్టుకుని సమాధానం చెప్పించే ప్రయత్నంలో బాగా వారిని తలకిందులుగా కట్టి లాఠీలతో బాదే సన్నివేశాలను చిత్రీకరించారు. దాంతో మల్కాన్‌గిరిలో చిత్రీకరణ పూర్తయింది.

ఇప్పుడు ‘పుష్ప’2’ బృందం రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకుంది. అక్కడి మెయిన్‌ సమీపంలో చిత్రీకరణ జరుగుతోంది. పుష్పరాజ్‌ కోసం గాలింపు జరుగుతున్నా భయపడకుండా ఎర్రచందనం దుంగలను ఓ ప్రాంతానికి చేర్చే పనిలో ఉన్నాడు పుష్పరాజ్‌. అడవి నుంచి తీసుకొచ్చిన చందనం దుంగలను ఓ కొండలా పేర్చిన సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి సినిమా షూటింగ్‌ 40 శాతం పూర్తయింది.

సీన్‌ పర్ఫెక్షన్‌ కోసం సుకుమార్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికి 40 శాతం పూర్తయింది అంటే ఈ ఏడాదిలో విడుదల లేనట్లే అనిపిస్తోంది. మిగిలిన 60 శాతం పూర్తి చేసి, నిర్మాణానంతర కార్యక్రమాలు అయ్యే సరికి సంక్రాంతి సీజన్‌ కూడా దాటిపోతుంది. దీని బట్టి చూస్తే ఏప్రిల్‌లో బన్ని పుట్టినరోజు సమయానికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలి చిత్రం సాధించిన విజయంతో భారీ అంచనాలు పెరగడంతో అంతకుమించి అనేలా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.