మహేష్ బాబు – జక్కన్నసినిమా కోసం పృథ్వీరాజ్‌.. ఎక్స్‌లో వైరల్‌గా మారిన వార్త!

మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందించనున్న విషయం తెలిసిందే. ‘ఎంబి 29’గా ఇది ప్రచారంలో ఉంది. దీనిపై వార్తలు సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఎక్స్‌లో షేర్‌ అవుతోంది. దీంతో ఈ హ్యాష్‌ ట్యాగ్‌ మరోసారి ట్రేండింగ్ లోకి వచ్చింది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారట. ఈ విషయమై పృథ్వీరాజ్‌ను రాజమౌళి సంప్రదించారని.. ఆయన కూడా ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఇందులో విలన్‌గా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మహేష్-పృథ్వీలను ఒకే స్క్రీన్‌పై చూడొచ్చని అభిమానులు ఆశపడుతున్నారు.

మలయాళంలో స్టార్‌గా ఎదిగిన పృథ్వీరాజ్‌ ఇటీవల ‘సలార్‌’తో ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. ఇప్పుడీ చిత్రంతోనూ ఇక్కడ అభిమానులను సొంతం చేసుకోవచ్చని భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన్ని తీసుకోవడం వల్ల మలయాళంలోనూ సినిమాను ప్రమోట్‌ చేసుకోవచ్చని చిత్రబృందం ఆలోచించినట్లు టాక్‌.

తాజాగా ఈ సినిమా కాస్టింగ్‌ డైరెక్టర్‌ విషయంలో రూమర్స్‌ రాగా… టీమ్‌ వాటిని ఖండించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ అప్‌డేట్‌ అయినా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తుందని క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ గురించి రాజమౌళి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. నటీనటుల ఎంపిక పక్రియ జరుగుతున్నట్లు చెప్పారు. త్వరలోనే సినిమా టైటిల్‌ను ప్రకటిస్తామన్నారు. ఈ సినిమాను ‘మహారాజ్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్కు సంబంధించిన ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్‌ రెడీ చేసినట్లు టాక్‌.