మరోసారి గోపిచంద్ వరలక్ష్మి కాంబో

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తెలుగులో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతోంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. విలన్ గా, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తో సినిమాలు చేస్తూ నటిగా తన సత్తా చాటుతుంది. తమిళంలో కెరియర్ ఆరంభించిన వరలక్ష్మి శరత్ కుమార్ అక్కడ విజయ్ లాంటి స్టార్ కి విలన్ గా నటించింది. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోలకి ప్రతినాయకిగా నటిస్తోంది.

క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలు వరలక్ష్మికి మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే నాంది సినిమాలో ఆమె పోషించిన లాయర్ పాత్ర సినిమాకి అస్సెట్ అయ్యింది. సెకెండాఫ్ మొత్తం నాంది చిత్రాన్ని తన భుజాలపై వరలక్ష్మి మోసింది. అలాగే మరికొన్ని హిట్ మూవీస్ ఆమె జాబితాలో ఉన్నాయి. గోపీచంద్ మలినేని వరలక్ష్మిని క్రాక్ మూవీలో జయమ్మ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు.

ఆ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ దర్శకుడు చేసిన వీరసింహారెడ్డిలో కూడా అన్నని ద్వేషిస్తూ అతనినే చంపే చెల్లిగా వరలక్ష్మి శరత్ కుమార్ చాలా క్రూరమైన పాత్రలో నటించింది. ఇప్పుడు మరోసారి వరలక్ష్మిని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం గోపీచంద్ కొనసాగిస్తున్నాడు. సెంటిమెంట్ గా కూడా ఆమె తన సినిమాలకి పాజిటివ్ అవుతోంది.

ఈ కారణంగానే గోపీచంద్ మలినేని రవితేజతో చేయబోయే నెక్స్ట్ సినిమా కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ని ఎంపిక చేశారు. అయితే ఈ చిత్రంలో కూడా ఆమెని విలన్ గా చూపించబోతున్నారా లేదంటే పాజిటివ్ రోల్ లో వరలక్ష్మిని పరిచయం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం రవితేజ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో కంప్లీట్ కానుంది. దీని తర్వాత వెంటనే గోపీచంద్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. దసరా తర్వాత ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది.