ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన తమన్

సోషల్ మీడియాలో తమన్ పై ఎక్కువగా ట్రోల్ జరుగుతూ ఉంటుంది. పాటలని కాపీ చేసేస్తూ ఉంటాడని తమన్ మీద ప్రధానంగా ఉన్న విమర్శ. అయితే దర్శకులు ఏం కోరుకుంటే అదే నేను ఇస్తానని తమన్ చెబుతూ ఉంటాడు. దర్శకుల టేస్ట్ ప్రకారం ఒక్కోసారి వారు అలాంటి ట్యూన్ కావాలని అడిగితే అలాంటి కాపీ ట్యూన్ ఇస్తానని గతంలో చెప్పాడు. తాజాగా వీరసింహారెడ్డి సినిమాలో వచ్చిన జైబాలయ్య సాంగ్ కూడా ఒసేయ్ రాములమ్మ సినిమాలోని టైటిల్ సాంగ్ కి కాపీగా ఉందని ప్రచారం జరిగింది. దీనిపై కూడా తమన్ క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం తమన్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అల వైకుంఠపురంలో సినిమా కంటే బెస్ట్ సాంగ్స్ ఈ సినిమాకి ఇస్తానని తమన్ ఇప్పటికే ప్రామిస్ చేశాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో తమన్ పై నెగిటివ్ ప్రచారం మొదలైంది. రిమూవ్ తమన్ ఎస్ఎస్ఎన్బీ28 అంటూ ఓకే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. దీంట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా నుంచి తమన్ ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఈ ట్రోలింగ్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఉండటం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబుకి తమన్ ఆశించిన స్థాయిలో స్వరాలు అందించలేడని వారి భావన. ఈ కారణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తెరపైకి మరో రూమర్ ని కూడా తీసుకొచ్చారు. మహేష్ మూవీ కోసం తమన్ అందించిన సాంగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి నచ్చలేదని, ఈ నేపధ్యంలో మాటల మాంత్రికుడు అతనిపై అసంతృప్తితో ఉన్నాడని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది.

ఇక ట్రోల్స్ పై సెలబ్రీటీలు ఎవరూ పెద్దగా రెస్పాండ్ కారు. కాని తమన్ మాత్రం తనపై జరిగే ట్రోల్స్ కి సమాధానం చెప్పడంతో పాటు ఒక్కోసారి కౌంటర్స్ కూడా ఇస్తాడు. అలాగే తాజాగా జరుగుతున్న నెగిటివ్ హ్యాష్ ట్యాగ్ ట్రోల్ పై రియాక్ట్ అయ్యాడు. రెస్ట్ ఇన్ పీస్ మిస్టర్ నెగిటివిటీ.. ఇందులో ఉన్న పిల్లబచ్చాలు అందరికి అని కామెంట్స్ చేస్తూ దానికి తాను గిటార్ తో మ్యూజిక్ ప్లే చేస్తున్న ఒక వీడియో కూడా యాడ్ చేశాడు. దీనిని బట్టి మీ ట్రోలింగ్ తో నన్ను ఏమీ చేయలేరని తమన్ గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది.