‘గుంటూరుకారం’పై పనిచేయని నెగెటివ్‌ ప్రచారం!

మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో వచ్చిన ‘గుంటూరు కారం’ భారీ విజయం అందుకుందని సినిమా నిర్మాత నాగవంశీ మీడియా సమావేశంలో వివరించారు. ‘ఈ సినిమా మీద కొంతమంది కావాలని నెగెటివ్‌ ప్రచారం చేశారు, పనికట్టుకొని మరీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు, అయినా కూడా సినిమా పెద్ద విజయం సాధించిందని చెప్పారు.

కొంతమంది మీడియా తప్పుడు ప్రచారం చేశారని, ఆ ప్రభావం మొదటి రోజు వుండింది అని, కానీ తరువాత కుటుంబ ప్రేక్షకులు చూసి, సినిమా బాగుంది అని చెప్పడంతో ప్రేక్షకులు ఆదరించారని చెప్పారు వంశీ. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అనే విషయాన్ని మేము ముందుగా ఇంకా బాగా ప్రచారం చేసి ఉంటే బాగుండేది అని, ప్రేక్షకుడిని ఈ సినిమాకి తగిన విధంగా తయారు చెయ్యలేకపోయాయేమో అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు.

రివ్యూస్‌ వలన సినిమా మీద ఎటువంటి ప్రభావం లేదని, ప్రేక్షకులకి సినిమా నచ్చి సినిమాని విజయవంతం చేసారని చెప్పారు నాగవంశీ. ఈ సినిమాని కొనుక్కున్నవాళ్ళు అందరూ సేఫ్‌ అని, వాళ్ళందరూ హ్యాపీగా వున్నారని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి మొదటి రోజు బాగా నెగటివ్‌ ప్రచారం చేసారని, అందుకని మొదటి రోజు ప్రేక్షకులు కొంచెం గందరగోళానికి గురయ్యారని, కానీ రెండో రోజు నుండి కలెక్షన్స్‌ మళ్ళీ అదిరిపోయాయని నిర్మాత నాగవంశీ చెప్పారు.