మరోమారు ఓటిటిలోకి నయనతార ‘అన్నపూరణి’!

అగ్ర కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ’అన్నపూరణి’ నీలేశ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం తలెత్తడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ప్లిక్స్‌ నుంచి దీనిని తొలగించిన విషయం తెలిసిందే. దాదాపు ఏడు నెలల తర్వాత ఇప్పుడీ చిత్రం తిరిగి ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. సింప్లీ సౌత్‌ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వేదికగా ఆగస్టు 9 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ సోషల్‌విూడియాలో పోస్ట్‌ పెట్టింది. ‘అన్నపూరణి ఈజ్‌ బ్యాక్‌. భారతదేశాన్ని మినహాయించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ఆగస్టు 9 నుంచి ఇది అందుబాటులో ఉండనుందని పేర్కొంది. అయితే, ఇక్కడ రిలీజ్‌ చేయకపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

నయనతార 75వ చిత్రంగా ’అన్నపూరణి’ విడుదలైంది. ’ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యరాజ్‌, జై కీలక పాత్రలు పోషించారు. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. చెఫ్‌గా ఎదగాలనే తన కలను ఎలా సాకారం చేసుకుంది? అనే కథాంశంతో దీనిని రూపొందించారు. థియేటర్లలో మిశ్రమ స్పందనలు సొంతం చేసుకొంది.

జనవరి నెలలో నెట్‌ప్లిక్స్‌లో విడుదల కాగా.. ఇందులోని కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. నయనతారతోపాటు చిత్రబృందంపై ముంబయి, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణసంస్థ ఓటీటీ నుంచి తొలగించింది.

మరోవైపు, నయనతార సైతం ఈ విషయంపై స్పందించారు. అన్నపూరణి సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంచి ఆలోచనతో రూపొందించాం. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలియజేసేందుకు తెరకెక్కించాం. ఈ ప్రయత్నంలో మాకు తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచాం. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చిన సినిమాను ఓటీటీ వేదిక నుంచి తొలగిస్తారని ఊహించలేదు. మా చిత్రబృందం, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. నేను ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదు. విూ మనోభావాలను గాయపరిచినందుకు క్షమించండి అని పేర్కొన్నారు.