స‌ముద్ర‌మ‌ట్టానికి చాలా ఎత్తులో ఉన్న నాగార్జున‌..అక్క‌డ ఏం ప‌ని?

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నాగార్జున రొమాంటిక్, భ‌క్తిర‌స చిత్రాలు, యాక్ష‌న్ చిత్రాలు ఇలా అన్ని జాన‌ర్స్‌లో సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తున్న వైల్డ్ డాగ్ అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా కరోనా వ‌ల‌న ఆగిపోగా, ఇప్పుడు తిరిగి ప్రారంభ‌మైంది. తాజాగా ఈ చిత్రాన్ని హిమాల‌య‌న్ ప్రాంతంలోని రోహ్‌తంగ్ పాస్ లో తెర‌కెక్కిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం నాగార్జున‌తో పాటు చిత్ర బృందం ఆ ప్రాంతానికి చేరుకోగా అక్క‌డ కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. అయితే ఈ విష‌యాన్ని నాగార్జున త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ట్విట్ట‌ర్‌లో వీడియోని షేర్ చేసిన నాగార్జున‌.. హాయ్.. రోహ్ తంగ్ పాస్ ద‌గ్గ‌ర బ్యూటిఫుల్ మార్నింగ్‌. ఇది సముద్ర‌మ‌ట్టానికి 3980 మీట‌ర్ల ఎత్తులో అంటే 13వేల ఫీట్లు. చాలా డేంజ‌ర‌స్ పాస్‌. న‌వంబ‌ర్ నుంచి మే వ‌ర‌కు దీన్ని మూసివేస్తారు. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ఇక్క‌డికొచ్చాం. షూటింగ్ చాలా బాగా జ‌రుగుతుంది. 21 రోజుల షెడ్యూల్ కోసం ఇక్క‌డికి వ‌చ్చాం. పూర్తైన త‌ర్వాత తిరిగి మిమ్మ‌ల్ని క‌లుస్తాను. ల‌వ్ యూ ఆల్ టేక్ కేర్ అంటూ వీడియోలో పేర్కొన్నారు.

నాగార్జున షేర్ చేసిన వీడియోలో అంద‌మైన ప‌ర్వ‌తాలు, నీలాకాశం అద్భుతంగా క‌నిపిస్తున్నాయి. 7 నెల‌ల త‌ర్వాత ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ కు రావ‌డం చాలా ఆనందంగా ఉంది అని నాగార్జున పేర్కొన్నారు. అయితే నాగార్జున షేర్ చేసిన ఈ వీడియోతో నెటిజ‌న్స్‌లో కొత్త అనుమానాలు మొద‌ల‌య్యాయి. 21 రోజులు ఆ ప్రాంతంలో ఉంటే బిగ్ బాస్ షోను ఎవ‌రు హోస్ట్ చేస్తార‌ని చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ర‌మ్య‌కృష్ణ‌, స‌మంత‌ల‌లో ఎవ‌రో ఒకరు ఈ షోకు హోస్ట్‌గా ఉంటార‌ని స‌మాచారం. చూడాలి మ‌రి!