ఫిల్మ్‌ సిటీలో శరవేగంగా ‘తండేల్‌’ చిత్రీకరణ!

నాగచైతన్య, లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి రెండోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ జంటగా ‘తండేల్‌’ సినిమా తెరకెక్కుతోంది. చందు మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ప్రధాన పాత్రధారులపై కీలకమైన టాకీ పార్టును తెరకెక్కిస్తున్నారు.

ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి డీగ్లామర్‌ పాత్రల్లో నటిస్తున్నారు. పాత్రలు వేషం, సంభాషణలు అత్యంత సహజంగా ఉంటాయని, భారీ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుందని సినీ వర్గాలు తెలిపాయి.’విరాటపర్వం’, ‘గార్గి’ చిత్రాల్లో నటనకుగానూ ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల్ని సొంతం చేసుకున్నారు సాయిపల్లవి. ఈ సందర్భంగా ఆమెని ‘తండేల్‌’ సినిమా సెట్లో ఆ చిత్రబృందం సత్కరించింది.