భవిష్యత్తులో ఆలోచన మరింత భయానకంగా ఉంది !

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఈ పేరు ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది. అందుకు కారణంగా ఆమెకు సంబంధించిన ఓ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌ కావడమే. కొందరు జారా పటేల్‌ అనే ఓ సోషల్‌ విూడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ విూడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

దీనిపై నెటిజన్లు, రష్మిక అభిమానులే కాదు పలువురు స్టార్స్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వెంటనే యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తాజాగా రష్మిక ఫేక్‌ వీడియోపై టాలీవుడ్‌ స్టార్‌ నటుడు నాగచైతన్య స్పందించారు. ‘టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తుంటే నిజంగా ఎంతో నిరుత్సాహం కలిగిస్తోంది. భవిష్యత్తులో ఇది ఏ స్థాయికి చేరుతుందో అన్న ఆలోచన మరింత భయానకంగా ఉంది. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. దీని బారిన పడిన బాధితులైన వారిని రక్షించడానికి కఠిన చట్టాల్ని అమలు చేయాలి’ అని అన్నారు. ఈ మేరకు సోషల్‌ విూడియాలో పోస్టు పెట్టారు.