నాగ చైతన్య దూత ఎక్కడ?

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్యతో మనం, థ్యాంక్యూ లాంటి హిట్ సినిమాలు తీసిన టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. నాగచైతన్య తొలిసారిగా నటిస్తున్న వెబ్ సిరీస్ అది. హారర్ థ్రిల్లర్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కింది ఈ వెబ్ సిరీస్. దీనిని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. అక్కినేని కుటుంబానికి మనం లాంటి మంచి హిట్ మూవీ ఇచ్చిన దర్శకుడు కావడంతో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదల అయింది. కానీ ఎలాంటి అప్డేట్ లేక చాలా రోజులైంది.

ఇప్పటి వరకూ తెలుగులో రూపొందిన వెబ్ సిరీస్ లు అన్నింటికంటే ఈ సిరీస్ బడ్జెటే ఎక్కువ. అమెజాన్ ప్రైమ్ వీడియో దూత వెబ్ సిరీస్ ను దాదాపు రూ.45 కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కించింది. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్, అక్కినేని నాగ చైతన్య చెరో రూ. 5 కోట్లు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇంత బడ్జెట్ తో రూపొందిన ఈ సిరీస్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ ఎలాంటి అప్డేట్ లేక పోవడంతో ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ అసహనం వ్యక్తం అవుతోంది.

ఈ వెబ్ సిరీస్ తర్వాత మొదలైన నాగ చైతన్య కస్టడీ మూవీ ఇప్పుడు దాదాపుగా పూర్తి కావొచ్చింది. కస్టడీ మూవీ మరో రెండు నెలల్లో ఫినిష్ కానున్నట్లు తెలుస్తోంది. తర్వాత మొదలైన మూవీ పూర్తికావొచ్చినా.. అంతకుముందు మొదలైన దూత వెబ్ ప్రాజెక్టు ఏమైనట్లు అనే ప్రశ్న వస్తోంది. ఎలాంటి అప్ డేట్ లేదు, ప్రమోషన్ కూడా చేసినట్లు కనిపించడం లేదు.

టాలెంటెడ్ దర్శకుడైన విక్రమ్ కుమార్ ఈ వెబ్ సిరీస్ గురించి ఏం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. ఈ వెబ్ సిరీస్ తో పాటు డైరెక్టర్ విక్రమ్ అమెజాన్ ప్రైమ్ తో మరో ప్రాజెక్టు కూడా అగ్నిమెంట్ చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దూత ఎప్పుడు పూర్తవ్వాలి, ఎప్పుడు రిలీజ్ కావాలి, మరో ప్రాజెక్టు ఇంకెప్పుడు మొదలు కావాలో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.