‘నాసామిరంగా..’ఈసారి ఊపేస్తాం.. సంక్రాంతి సినిమాపై నాగార్జున

‘తెలుగువారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ప్రేక్షకులు గతంలో నా సంక్రాంతి సినిమాలను గొప్ప హిట్‌ చేశారు. ఇప్పుడు ’నా సామిరంగ’ చిత్రాన్ని కూడా అదే రీతిలో ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సారి పండుగకు కిష్టయ్య వస్తున్నాడు. ’నా సామిరంగ’ అంటూ బాక్సాఫీసును కొట్టబోతున్నాడు’ అని నాగార్జున అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ’నా సామిరంగ’ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. విజయ్‌ బిన్నీ దర్శకుడు. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ’ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. అన్నీంటినీ ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నాను. నాన్నగారి ఆజ్ఞగా భావించి ’నా సామిరంగ’ చిత్రం చేశాను. కీరవాణి అద్భుతమైన పాటలు ఇచ్చారు. మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయడం ఒక రికార్డు’ అని తెలిపారు.

అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ ’చిన్నతనం నుంచి నేను నాగార్జున గారికి అభిమానిని. ఈలలు వేస్తూ థియేటర్లలో ఆయన సినిమాలు చూశాను. కీరవాణి, చంద్రబోస్‌ గారు మా టీంకు అండగా నిలిచారు’ అని తెలిపారు.

రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ ’నాగార్జున గారితో కలసి నటించడం మరచిపోలేని అనుభవం. అక్కినేని అభిమానులందరూ ఈసారి థియేటర్లలో పండుగ చేసుకోవడం ఖాయం’ అన్నారు.

విజయ్‌ బిన్నీ మాట్లాడుతూ ’చాలా తక్కువ టైంలో మంచి క్వాలిటీతో సినిమాను పూర్తి చేశాం. నా సాంగ్స్‌ చూసి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి రుణపడి ఉంటాను. యూనిట్‌లో ప్రతి ఒక్కరి సహకారంతో సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించగలిగాను’ అన్నారు.

కీరవాణి మాట్లాడుతూ ’కొత్త ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇవ్వడంలో నాగార్జున ముందుంటారు. ’నా సామిరంగ’తో విజయ్‌ దర్శకుడిగా హిట్‌ అందుకోవాలి’ అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి నాగార్జున గారు నన్ను ఆహ్వానించడమే గొప్ప గౌర వం అని చంద్రబోస్‌ తెలిపారు. నాగార్జున గారి లాంటి స్టార్‌తో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని ఆశికా రంగనాథ్‌ చెప్పారు.