యువ హీరోతో మురగదాస్ పాన్ ఇండియా ప్లాన్

ఏఆర్ మురుగుదాస్… ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. సోషల్ మెసేజ్ లతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ను కలిపి సినిమాలు చేసి సక్సెస్ అయిన ఈ దర్శకుడు.. తన కెరియర్ లో ఎన్నో అద్భుత చిత్రాలను తెరెకెక్కించారు. దీనా, గజిని, తుపాకీ, కత్తి లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సూర్యతో గజినీ చేసిన ఈయన… అదే సినిమాను హిందీలో అమీర్ ఖాన్ తో రీమేక్ చేశారు. దళపతి విజయ్ తో తుపాకీ చిత్రాన్ని చేసి మళ్లీ అదే సినిమాను హిందీలో అక్షయ్ కుమార్ తో హాలిడేగా తీసి హిట్టు కొట్టారు.

కానీ ఆ తర్వాత తీసిన సినిమాలతో వరుసగా పరాజయాల పాలయ్యారు. దర్బార్ సినిమా డిజాస్టర్ తో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇన్నాళ్ల తర్వాత డైరెక్టర్ ఏఆర్ మురుగుదాస్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా చేయబోతున్నారు. దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రజినీ కాంత్ తో తీసిన దర్బార్ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో సినిమాలకు దూరమయ్యారు. కానీ ఆ తర్వాత రాంకీ సినిమాకు కథను మాత్రం అందించారు.

మళ్లీ ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా పాన్ ఇండియా చిత్రం తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను లైట్ హౌస్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్నట్లు సమాచారం. శివకార్తికేయన్, మురుగుదాస్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం శివకార్తికేయన్ అయిలాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన మురుగుదాస్ తీయబోయే చిత్రం షూటింగ్ లో పాల్గొంటారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది, సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనే విషయాలు తెలియాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.