లక్నోలో రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’ షూటింగ్‌ షురూ…

మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన నటించిన చిత్రాలేవీ ఊహించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. తాజాగా రాబోయే చిత్రంతో ఎలాగైనా హిట్‌ అందుకోవాలని కసిగా కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా చేస్తున్నారు. షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

ఈ చిత్రం షూటింగ్‌ షెడ్యూల్‌ లక్నోలో షురూ అయిందని తెలుస్తోంది. త్వరలోనే రవితేజ సెట్స్‌లో జాయిన్‌ కాబోతున్నారు. లక్నోలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. అలాగే ఈ షెడ్యూల్‌తో 50 శాతం సినిమా పూర్తి కాబోతుందని తెలుస్తోంది. రవితేజ ఇప్పటికే షూటింగ్‌ నుంచి విరామం తీసుకొని ఫ్యామిలీ వెకేషన్‌ కోసం యూఎస్‌ వెళ్లి తిరిగొచ్చిన విషయం తెలిసిందే.

ఈ చిత్రాన్ని పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్‌ లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ పోజ్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ని అలరించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు ‘మిస్టర్‌ బచ్చన్‌’ టైటిల్‌ పెట్టడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ‘మిస్టర్‌ బచ్చన్‌..నామ్‌ తో సునా హోగా’ అని రవితేజ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. రవితేజ కథానుగుణంగా అమితాబ్‌బచ్చన్‌ అభిమానిగా కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రానికి ఆయనంక బోస్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా వర్క్‌ చేస్తున్నారు.