సైలెంట్‌ గా దూసుకొచ్చిన మీనాక్షి!

ఇప్పుడు టాలీవుడ్‌ లో బిజీ హీరోయిన్‌ ఎవరంటే శ్రీలీల పేరే చెప్తారు. దాదాపు ఎనిమిది సినిమాలు ఆమె చేతిలో వున్నాయి. ఇప్పుడు ఈ రేసులోకి మరో హీరోయిన్‌.. మీనాక్షి చౌదరి కూడా దూసుకొస్తున్నారు.

హిట్‌ 2, ఖిలాడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మీనాక్షి… ఇప్పుడు టాప్‌ లోకి వెళ్లడానికి రెడీగా వుంది. మీనాక్షి చౌదరి చేతిలో ఇప్పుడు పెద్ద, మీడియం కలుపుకొని దాదాపు అరడజను చిత్రాలు వున్నాయి. మహేష్‌ బాబు ‘గుంటూరు కారం’లో హీరోయిన్‌ గా నటిస్తోంది మీనాక్షి.

అలాగే విశ్వక్‌ సేన్‌ తో మెకానిక్‌ రాకీ సినిమా చేస్తోంది. ఇటీవలే ప్రారంభమైన దుల్కర్‌ సల్మాన్‌ పాన్‌`ఇండియన్‌ చిత్రం లక్కీ భాస్కర్‌లో కూడా ఆమెనే హీరోయిన్‌. వరుణ్‌ తేజ్‌ చేయబోతున్న పాన్‌ ఇండియా ఎంటర్‌ టైనర్‌ ‘మట్కా’ లో కథానాయికగా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.

ఇలా క్రేజీ ఆఫర్స్‌ తో దూసుకుపోతున్న మీనాక్షికి ఇప్పుడు మరో బిగ్‌ ఆఫర్‌ వచ్చింది. విజయ్‌, వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతుంది. ఇందులో ఓ హీరోయిన్‌ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ఇవి కాకుండా ఆమె చేతిలో కొన్ని బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌ కూడా వున్నాయి. మొత్తానికి వరుస సినిమాలతో శ్రీలీల తర్వాత మరో బిజీ హీరోయిన్‌ గా మారిందిమీనాక్షి చౌదరి.