త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందిన అతడు సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మహేష్ బాబు 50వ పుట్టినరోజు (ఆగస్ట్ 9, 2025) సందర్భంగా ఈ చిత్రం 4K వర్షన్లో పునఃప్రదర్శనకు సిద్ధమవుతోంది. మహేష్ కెరీర్లో గోల్డెన్ హిట్గా నిలిచిన ఈ సినిమా, బిగ్ స్క్రీన్పై మళ్లీ చూడాలన్న అభిమానుల ఉత్సాహానికి హద్దులే లేవు. టీవీల్లో ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టని ఈ మాస్టర్పీస్ ఇప్పటికీ క్రేజ్ తగ్గించుకోలేదు.
ఈ రీ రిలీజ్కు సంబంధించి థియేట్రికల్ రేటు చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. తాజా సమాచారం మేరకు అతడు రీ రిలీజ్ రేటు రూ.3.06 కోట్లకు చేరిందట. ఇది ఇప్పటి వరకు టాలీవుడ్ రీ రిలీజ్ సినిమాల్లో వచ్చిన అత్యధిక రేటు అనే టాక్ ఫిలింనగర్లో వినిపిస్తోంది. ఈ రేటు చూస్తే సినిమా మీద ఉన్న క్రేజ్ ఎంత వుందో స్పష్టంగా అర్థమవుతుంది. మహేష్ అభిమానులు ఈ సినిమాను మళ్లీ స్క్రీన్పై చూడటానికి ఎగబడుతున్నారు.
ఇప్పటికే పోస్టర్లు, పాత వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. #Athadu4KOnAug9th అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. థియేటర్ ఓనర్లు కూడా ఈ సినిమాకు ప్రత్యేకంగా స్క్రీన్లు కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. 4K రీమాస్టరింగ్తో విజువల్స్, ఆడియో మరింత నాణ్యతతో అందనున్నాయి. మురారి, పోకిరి, బిజినెస్మ్యాన్ వంటి సినిమాల రీ రిలీజ్ విజయం తర్వాత, అతడు ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయబోతుందని ఫ్యాన్స్ ఆశాభావంతో ఉన్నారు. తొలి రోజు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.