పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి – మహేష్ బాబు కాంబో మూవీ SSMB29 నుంచి రోజుకో కొత్త ఆసక్తికర అప్డేట్ బయటకి వస్తోంది. ఇప్పటికే అడ్వెంచర్ థ్రిల్లర్ అని తెలిసిన ఈ కథకు ఇప్పుడు కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో డైనోసార్లు ఉంటాయట. అవును, బాహుబలి తర్వాత జక్కన్న మైండ్ గేమ్ జురాసిక్ జోన్ లో మారబోతోందా అన్నది ఇప్పుడు ఫిలింనగర్లో హాట్ టాపిక్.
కథ మొత్తం అడవి నేపథ్యంలో సాగుతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ అందులో డైనోసార్ ఎలిమెంట్ ఉండబోతుందంటే అసలు రేంజ్ మరో స్థాయిలో ఉంటుందని అభిమానులు ఖచ్చితంగా ఊహించగలరు. సినిమాలో మహేష్ బాబు డైనోసార్ల నుంచి పారిపోవడం, వాటితో యాక్షన్ సీక్వెన్స్లు ఉండబోతున్నాయట. వీఎఫ్ఎక్స్ టీమ్ ఇప్పటికే ఈ ఎపిసోడ్ల కోసం భారీగా గ్రాఫిక్స్ పనులు ప్రారంభించిందని సమాచారం.
ఈ సినిమాలో దాదాపు 4 నుంచి 5 డైనోసార్ బేస్డ్ సీన్లు ఉంటాయట. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉండబోతుందా? లేక ఫిక్షనల్ ల్యాండ్లో మిస్టరీ అడ్వెంచర్కు వెళ్లిపోతారా? అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఇది నిజమైతే ఇండియన్ సినిమాలోని అత్యంత టెక్నికల్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదే అవుతుంది. ఇప్పటికే ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తుండగా, ఫృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంకా తండ్రి పాత్రలో ఓ ప్రముఖ స్టార్ కనిపించబోతున్నారట. ఆయన పేరును చిత్ర బృందం ఇప్పటివరకు సీక్రెట్గా ఉంచింది. ఈ సినిమాలో ఫాదర్-సన్ ఎమోషన్ కూడా బలంగా ఉండబోతోందట. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ను KL నారాయణ నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, 2026 చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది. అయితే అప్పటి వరకూ ఈ డైనోసార్ థియరీ నిజమా లేక ఊహనా అన్నది మాత్రం అంచనాల్ని రెట్టింపు చేస్తోంది!