బాలయ్యకు సెట్‌లో కోపం ఎందుకు ఎక్కువో తెలుసా…!?

నందమూరి బాలకృష్ణ, తమిళ దర్శకుడు కె.ఎస్‌ రవికుమార్‌ తో రెండు సినిమాలు వరుసగా చేశారు. 2018లో ‘జై సింహ’ ఆ తరువాత మరుసటి సంవత్సరం అంటే 2019లో ‘రూలర్‌’ అనే సినిమాకి పనిచేశారు. ఇప్పుడు రవికుమార్‌ వార్తల్లో వున్నారు. ఎందుకంటే అతను బాలకృష్ణపై చేసిన కొన్ని వ్యాఖ్యలకు అభిమానులు రవికుమార్‌ పై ఫైర్‌ అవుతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే రవికుమార్‌ ‘గార్డియన్‌’ అనే తమిళ సినిమా మీడియా సమావేశానికి హాజరయి అక్కడ బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. అందుకని బాలకృష్ణ అభిమానులు రవికుమార్‌ ని ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతకీ రవికుమార్‌ బాలకృష్ణ గురించి ఏమన్నారంటే ‘షూటింగ్‌ సమయంలో ఎవరైనా నవ్వితే బాలకృష్ణకి కోపం వస్తుందని… వెంటనే ఆ నవ్విన వ్యక్తిని పిలిచి కొడతారని’ చెప్పారు రవి కుమార్‌.

అలా ఒకసారి బాలకృష్ణతో సినిమా చేస్తున్నప్పుడు తన సహాయ దర్శకుడు అయిన శరవణన్‌ ని ఫ్యాన్‌ తనవైపు తిప్పమన్నాను అని, అతను అనుకోకుండా ఆ ఫ్యాన్‌ బాలకృష్ణ వేపు తిప్పాడని, ఆ గాలికి బాలకృష్ణ విగ్‌ ఒక్కసారిగా కదిలిందని, అది చూసి సహాయ దర్శకుడు వెంటనే నవ్వాడని చెప్పారు రవికుమార్‌. అతను నవ్వటం చూసి బాలకృష్ణకి వెంటనే కోపం వచ్చిందని, ‘ఎందుకు నవ్వుతున్నావ్‌’ అని గట్టిగా అతనిపై అరిచారని, ఎక్కడ సహాయ దర్శకుడిని కొడతాడో అని నేను బాలకృష్ణ దగ్గరికి వెళ్లి సర్ది చెప్పాను అని రవికుమార్‌ చెప్పుకొచ్చారు.

అయినా కూడా బాలకృష్ణ వినలేదు అని, ఆ సహాయ దర్శకుడిపై అరిచి అక్కడనుంచి వెళ్లిపొమ్మని చెప్పారని రవికుమార్‌ అప్పుడు జరిగిన సంఘటనలను చెబుతూ బాలకృష్ణ గురించి చెప్పుకొచ్చారు. బాలకృష్ణ అభిమానులు రవి కుమార్‌ చేసిన వ్యాఖ్యలని తప్పుపట్టారు. బాలకృష్ణ వ్యక్తిత్వం తెలిసినవాళ్ళు ఎవరూ అలా మాట్లాడరని, ఎందుకంటే రవికుమార్‌ కి సినిమాలు ఎవరూ ఇవ్వనటువంటి సమయంలో బాలకృష్ణ పిలిచి మరీ అతనితో రెండు సినిమాలకి దర్శకత్వం ఇప్పించారని, అటువంటి బాలకృష్ణపై రవికుమార్‌ ఆలా వ్యాఖ్యలు చెయ్యడం తగదని అభిమానులు అంటున్నారు.

దర్శకుడు చెప్పినట్లు చేసే నటుడు బాలకృష్ణ అని చాలా సందర్భాల్లో చెప్పి, ఇప్పుడు ఇలా వ్యంగ్యంగా మాట్లాడటం వలన బాలకృష్ణ కంటే అతని అభిమానులమైన మాకు ఇంకా ఎక్కువ కోపం వస్తోందని, రవికుమార్‌ పై సామాజిక మాధ్యమాల్లో బాలకృష్ణ అభిమానులు విరుచుకుపడుతున్నారు.