తల్లి శ్రీదేవి గౌనులో మెరిసిన ఖుషికపూర్‌

బాలీవుడ్‌తోపాటు సౌత్‌లో కూడా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అలనాటి తార దివంగత నటి శ్రీదేవి. అదే తరహాలో ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ కూడా ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. తల్లి అడుగుజాడల్లో నడుస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది.

ఇప్పుడు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్‌ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఖుషి ‘ది ఆర్చీస్‌’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ తనయ సుహానా ఖాన్‌ కూడా నటిస్తోంది. ముంబైలోని నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌లో గత రాత్రి ఈ చిత్ర ప్రీమియర్‌ షో నిర్వహించారు. ఈ షోకు జాన్వీ కపూర్‌తో పాటు బాలీవుడ్‌ తారలంతా హాజరయ్యారు.

ఇక ఈ షోలో ఖుషి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి చిత్రం కావడంతో సెంటిమెంట్‌గా తన తల్లి శ్రీదేవి డ్రెస్‌లో ఈవెంట్‌కు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బంగారు వర్ణంలోని స్ట్రాప్‌లెస్‌ గౌను ధరించి తన తల్లికి ప్రత్యేకమైన రీతిలో నివాళులర్పించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 2013లో ఐఐఎఫ్‌ఏ అవార్డ్స్‌ వేడుకలో శ్రీదేవి ఇదే గౌను ధరించారు. రెడ్‌ కార్పెట్‌పై శ్రీదేవి ఈ గౌనుతో నడిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఇప్పుడిదే గౌనును ఖుషి ధరించి అందరినీ ఆకర్షించింది. అంతేకాదు, తల్లి ఆభరణాలను కూడా వేసుకుంది. షారుఖ్‌ ఖాన్‌ గారాలపట్టి సుహానా ఖాన్‌, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌, అమితాబ్‌ మనువడు అగస్త్య నంద ప్రధాన పాత్రల్లో అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ది ఆర్చీస్‌’. గల్లీ బాయ్‌, జిందగీ నా మిలేగీ దోబారా, లస్ట్‌ స్టోరీస్‌ చిత్రాల ఫేం బాలీవుడ్‌ స్టార్‌ దర్శకురాలు జోయా అక్తర్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ లో డిసెంబర్‌ 7 ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమాను 1964 ఇయర్‌లో జరిగిన కథగా తెరకెక్కించగా.. బాల్యం, టీనేజీలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింది.