కార్తీ ‘సర్దార్‌’కు సీక్వెల్‌!

పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘సర్దార్‌’. ఈ చిత్రం 2022లో విడుదలై సూపర్‌ హిట్‌ జాబితాలో నిలిచింది. వసూళ్ల పరంగా రూ.100 కోట్లు సాధించింది. మినరల్‌ వాటర్‌ పేరుతో విక్రయించే తాగునీటిలో ఉండే శరీరానికి హాని కలిగించే అంశాలు, వాణిజ్య పరమైన రాజకీయాలను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించారు.

ఇందులో హీరో కార్తీ పోలీస్‌ ఆఫీసర్‌గా, రా ఏజెంట్‌గా నటించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. యాక్షన్‌, థ్రిల్లర్‌ కోణంలో సాగిన ఈ చిత్రంలో రజీషా విజయన్‌, రాశీఖన్నా, లైలా,చుంకీపాండే ప్రధాన పాత్రలను పోషించగా జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్‌ ‘సర్దార్‌ 2’ రూపొందనుంది.

కార్తీ జన్మదినం సందర్భంగా మే 25న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీపావళికి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ దఫా సినిమాలో డ్రగ్స్‌ అక్రమ రవాణాను ప్రధానాంశంగా చేసుకుని ‘సర్దార్‌`2’ను తెరకెక్కించాలని దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ ప్లాన్‌ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా సమాజానికి, యువతకు మాదకద్రవ్యాలు ఏ విధంగా హాని కలిగిస్తున్నాయే అంశంతో యవతలో చైతన్యం, అవగాహన కల్పించేలా ఈ కథను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే, ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.