కమల్ సరసన బాలీవుడ్ బ్యూటీ

లోకనాయకుడు కమల్ హాసన్ తన రేంజ్, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని విక్రమ్ మూవీ ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ మూవీ పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచి చాలా కాలం తర్వాత కమల్ హాసన్ నటన అంటే ఇలా ఉంటుంది అనేలా చేసింది.

విక్రమ్ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కమల్ హాసన్.. ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఎప్పటి నుండో అనుకుంటున్న ఇండియన్-2 సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు కమల్. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ దాదాపుగా పూర్తయినట్లు టాక్. ఇండియన్-2 అలా అయిపోగానే ఆ వెంటనే లెజెండరీ డైరెక్టర్ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయనున్నారు కమల్.

చాలా కాలం తర్వాత మణిరత్నం, కమల్ కాంబోలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి కాంబోలో వచ్చిన నాయకుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఎన్ని సంచలనాలు సృష్టించిందో సినీ అభిమానులకు ఇప్పటికీ గుర్తే. అలాంటి సూపర్ హిట్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీని కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మీదే నిర్మిస్తుండటం విశేషం. అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చారు కానీ ఆ తర్వాత ఎలాంటి వార్తా లేకపోవడంతో ప్రాజెక్టు పక్కన పడిపోయిందేమో అనుకున్నారంతా కానీ సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఈ చిత్రం. పొన్నియన్ సెల్వన్-2 తర్వాత వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని మణిరత్నం చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో కమల్ సరసన త్రిష, నయనతార నటిస్తారని వార్తలు వచ్చినా.. ఆ తర్వాత అవేవీ నిజం కాదని తెలిసిపోయింది. అయితే ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని మణిరత్నం ప్లాన్ అంట. అందుకే బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విద్యా అయితే కమల్ కు మంచి జోడీగా ఉండటంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో ప్రచారం అవుతుందని అనుకుంటున్నారట. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికి వచ్చి సమాజంలో ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని తెలుస్తోంది.